ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట టీడీపీలో మాజీ మంత్రి, సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావుకు ధీటుగా మరో వర్గం తయారైంది. రాబోయే ఎన్నికల్లో యువతకు అత్యధిక స్థానాలు కేటాయిస్తున్నట్లు ఇంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే చిలకలూరిపేటలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు భాష్యం ప్రవీణ్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. పత్తిపాటి పుల్లారావుకు రాబోయే ఎన్నికల్లో సీటు ఇచ్చే విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి గా ఉన్న సమయంలో ఆయన నియోజకవర్గంపై అంతగా దృష్టి పెట్టలేదన్నది టాక్. అంతే కాకుండా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడు నియోజకవర్గంలో కొంత కాలం ప్రజలకు అందుబాటులో ఉండలేదని అంటున్నారు.

ప్రస్తుతం టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీనియర్ నేత అయిన పత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సక్రమంగా పోషించడం లేదనీ, నియోజకవర్గంలో క్యాడర్ అందుబాటులో ఉంటూ అధికార పక్షంపై సమర్ధవంతంగా పోరాడటం లేదని ఆయన వ్యతిరేక వర్గీయులు అంటుంటారు. దీంతో పత్తిపాటికి వ్యతిరేకంగా ఓ పెద్ద గ్రూపు తయారు అయ్యింది. ఈ విషయం పార్టీ పెద్దలకు తెలిసే కొత్త అభ్యర్ధిని అన్వేషిస్తున్నారని, ఆ క్రమంలోనే భాష్యం ప్రవీణ్ తెరపైకి వచ్చారని అంటున్నారు. భాష్యం ప్రవీణ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.

టికెట్ ఆశిస్తున్న భాష్యం ప్రవీణ్ .. తన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన రంజాన్ తోఫా పంపిణీ, ఈ నెల 20న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఆయన వర్గీయులు ఇప్పటికే మీడియాకు తెలిపారు. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసి పత్తిపాటి పుల్లారావు, ఆయన వర్గీయులు హర్ట్ అయ్యారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రబాబు స్పందించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడతారని, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని చెప్పారుట. కార్యక్రమాల అమలు పై మరింత శ్రద్ద పెట్టాలని సూచించారుట.
ఆ తర్వాత అచ్చెన్నాయుడు ఈ విషయంపై పత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్ లతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కమ్యూనికేష్ గ్యాప్ వల్ల ఈ వివాదం తలెత్తిందని పుల్లారావుకు ప్రవీణ్ చెప్పారు. తనకు వేరే దురుద్దేశాలు కూడా ఏవీ లేవని కూడా చెప్పినట్లు తెలిసింది. పుల్లారావుకు కూడా కార్యక్రమాల నిర్వహణకు తాను వ్యతిరేకిని కాదని, జరిగిన ప్రచారమే నియోజకవర్గ కార్యకర్తల్లో అసంతృప్తి, అలజడిని రేకెత్తించిందని చెప్పారు. దీంతో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఇరువురికి అచ్చెన్నాయుడు సూచించారు. దీంతో ఈ వివాదానికి పురిస్టాప్ పడినట్లు అయ్యింది.
అయితే చిలకలూరిపేట నుండి పత్తిపాటి పుల్లారావు 1999 నుండి అయిదు సార్లు పోటీ చేయగా, 2004, 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలైయ్యారు. చంద్రబాబు దృష్టిలో మాత్రం మరో సారి పత్తిపాటి పుల్లారావు అభ్యర్ధిత్వమే ఖరారు చేయాలని ఆలోచన ఉందని అంటున్నారు. అయితే పార్టీ లోకేష్ టీమ్ ఆధ్వర్యంలో అంతర్గత సర్వే ప్రకారం కొత్త అభ్యర్ధి అయితే మంచిదనే అభిప్రాయం వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం పార్టీ మాత్రం ఇరువురి సేవలను ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో ఉంది.
హిందూత్వ ముద్ర చెరిగిపోతుందా..? చర్చికి ప్రధాని మోడీ తొలి సారిగా..