YCP : గుంటూరు జిల్లా చిలకలూరిపేట chilakaluripeta నియోజకవర్గంలో హాట్రిక్ విజేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు pattipati pullarao (టీడీపీ) TDP పై మొదటి ఎన్నికల్లోనే విడతల రజిని vidatala rajani (వైసీపీ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఎన్ఆర్ఐగా వచ్చిన రజిని తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీకి ఈ నియోజకవర్గం కంచుకోట లాంటిది. అయితే ఆ పార్టీలో కొనసాగితే పుల్లారావును కాదని ఎమ్మెల్యే సీటు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో గత ఎన్నికల ముందు రజిని వైసీపీలో చేరారు. అయితే ఎన్నికల్లో పుల్లారావు విజయం ఖాయమని అందరూ అనుకున్నప్పటికీ రజిని ఊహించని రాజకీయం చేశారు. దానికి తోడు ఫ్యాన్ గాలి తోడు కావడంతో పత్తిపాటి హవాకు చెక్ పెట్టారు.
ప్రజలు, నాయకులతో మమేకం అవుతూ నియోజకవర్గంలో మంచిపేరు తెచ్చుకోవడంతో పాటు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాష్ట్ర స్థాయిలో ఇమేజ్ సాధించారు రజిని. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఆమెకు సవాల్ గా మారాయి. గడచిన ఎన్నికల్లో ఓడిపోయిన పత్తిపాటి పుల్లారావు ప్రజలకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నాలు చేశారు. దీనికి తోడు రాజధాని అంశం కొంత టీడీపీకి అనుకూలంగా మారే పరిస్థితులు ఉన్నాయి. రజిని ఎమ్మెల్యే అయిన తరువాత నియోజకవర్గంలో పెద్దగా జరిగిన అభివృద్ధి అయితే ఏమీ లేదని అంటున్నారు. కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రం లబ్దిదారులకు అందుతున్నాయి. ప్రచారానికే రజిని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రజిని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ లేదని అంటున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎడ్లపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల మండలాలు ఉండగా ప్రస్తుతం ఈ మూడు మండలాల్లో టీడీపీ బలంగానే ఉందని అధికార వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. అయితే అధికార బలంతో నియోజకవర్గంలో రజిని అత్యధిక పంచాయతీలు కైవశం చేసుకునే వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. మండల స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపిక, ఇతర విషయాలపై దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి.
విడతల రజిని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తను నిర్వహించే కార్యక్రమాలకు సోషల్ నెట్ వర్క్ ద్వారా విస్తృత ప్రచారం లభిస్తోంది. నియోజకవర్గానికే పరిమితం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రజిని సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పోస్టు చేస్తుంటారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సైతం విడతల రజిని పనితీరు పట్ల ముగ్దుడయ్యాడని అంటుంటారు. ఇకపోతే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అనూహ్య విజయం సాధించిన రజిని పంచాయతీ ఎన్నికల్లో తన హవా చాటుతుందో లేదో వేచి చూడాలి.