విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీకోదండ రామాలయంలో రాముడి విగ్రహం తలను దుండగులు నరికిన ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. టీడీపీ, బిజేపీ హిందూ సంఘాలు ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. అధికార వైసీపీ టార్గెట్ గా ప్రతిపక్షాలు విమర్శలు చేయగా, రామతీర్ధం ఘటనలో ప్రభుత్వంపై కుట్ర కోణం ఉందని, ప్రతిపక్ష పాత్ర ఉందంటూ అధికార వైసీపీ ఎదురుదాడి చేసింది. రాజకీయ పార్టీల మధ్య ఈ వివాదం ఇలా కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా నేడు త్రిదండి చిన జీయర్ స్వామి రామతీర్థం కోదండ రామాలయాన్ని సందర్శించారు. ఘటన గురించి అధికారులు, అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రామతీర్థం ఘటనను ప్రభుత్వం ఒక హెచ్చరికగా తీసుకుని ఆలయాల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 17వ తేదీ నుండి ఏపిలోని మిగిలిన ఆలయాలను కూడా సందర్శిస్తానని చిన జీయర్ తెలిపారు. తన పర్యటన రాజకీయాలతో సంబంధం లేదని, సాధారణ రీతిలోనే తన యాత్ర కొసాగుతుందని అన్నారు. ఆయా ఆలయాల్లో భద్రతా లోపాలను గుర్తించి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తానని చెప్పారు. రామతీర్ధం ఆలయంలో విగ్రహాల పునః ప్రతిష్టకు ఆగమశాస్త్ర సూచనలు చేశానని చిన జీయర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది కూడా చదవండి…అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన శబరిమల..మకరజ్యోతి దర్శనం