ఎట్టకేలకు రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా ప్రారంభం అయ్యింది. స్థల సేకరణలో వివాదాలు, కోర్టు కేసులు తదితర కారణాలుగా నెలలు తరబడి వాయిదా పడుతూ వచ్చిన ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం ఖరారు కావడంతో నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా అవినీతి అనేది తావు ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే చెబుతున్నారు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో లబ్దిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన వార్డు వాలంటీర్లను విధుల నుండి కూడా తొలగించారు. ఈ పరిణామంతో చాలా వరకు వార్డు వాలంటీర్లు లబ్దిదారుల నుండి డబ్బులు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వైసీపీ నాయకులే ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామంటూ లబ్దిదారుల నుండి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఓ గ్రామంలో నాయకుడికి డబ్బులు ఇచ్చిన మహిళకు ఇళ్ల పట్టా మంజూరు కాకపోవడంతో ఆ నాయకుడి అవినీతి బహిర్గతం అయ్యింది. ఆ మహిళ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడంతో అతని విషయం వెలుగులోకి వచ్చింది. పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు.
విషయంలోకి వెళితే.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పార్వతమ్మ అనే మహిళ కు ఇంటి స్థలం మంజూరు చేయిస్తానంటూ ఆ ప్రాంత వైసీపీ నాయకుడు సురేంద్ర రూ.30వేలకు ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ గా రూ.5వేలు తీసుకున్నాడు. అయితే ఇళ్ల పట్టాల పండుగ వచ్చేసింది కానీ లిస్ట్ లో ఆమె పేరు లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆ మహిళ సురేంద్రను నిలదీసింది. అధికార పార్టీ నాయకుడు కదా ఆమెపైనే తిరుగబడ్డాడు. అయితే ఆమె ఈ సమస్యను అంతటితో వదిలివేయదల్లుకోలేదు. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేయగా ఆ నాయకుడు ఈమె వద్ద నుండే కాక మరి కొంత మంది వద్ద నుండి డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. పలువురు బాధితులు నేరుగా ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు ఆ వైసీపీ నాయకుడి నిర్వాకంపై పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు..సురేంద్రను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ,సురేంద్ర చిత్తూరు పార్లమెంట్ బీసి సంక్షేమ సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొందరు తమ పదవులను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలని చూస్తుంటారు. ఇలా వెలుగులోకి వచ్చిన సందర్భాల్లో పరువు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తుంటాయి.