chittoor : చిత్తూరు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. 18 డివిజన్ ల టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్ లను తాము లేకుండానే విత్ డ్రా చేశారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పిటిషనర్ ల తరపున సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నామినేషన్ వేసిన అభ్యర్థులు కాకుండా వారి తరపున వేరే వారు నామినేషన్ విత్ డ్రా చేయడం చట్ట విరుద్ధమని దమ్మాలపాటి పేర్కొన్నారు. అలాగే అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేశారని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ వీడియో పుటేజీని కోర్టుకు సమర్పించాలన్నారు. అభ్యర్థులు లేకుండా నామినేషన్ ఉపసంహరణ పత్రాలు తీసుకున్న ఆర్ ఓలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 18 మంది అభ్యర్థులను తిరిగి పోటీచేసే విధంగా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది శ్రీనివాస్ కోర్టును కోరారు.
కాగా ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ లు ఉపసంహరించుకున్నారని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. దీనిపై ఆర్ ఒలను నివేదిక కోరామనీ, రేపటికి వస్తాయని కోర్టుకు వివరించారు. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది పిటిషన్ లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ లకు విచారణ అర్హత లేదన్నారు. ఫిర్యాదులు ఏమైనా ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్ లో చూసుకోవాలనీ, ఇక్కడ విచారించడానికి వీలు లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. పోలింగ్ కు మూడు రోజుల ముందు చిత్తూరు మున్సిపాలిటికి సంబంధించి వివాదం హైకోర్టుకు చేరడంతో అక్కడి ఎన్నికపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.