TDP MLC: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఏపి ఎన్జీవో సంఘ నేత అశోక్ బాబుపై ఏపి సీఐడీ కేసు నమోదు చేసింది. సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగంపై ఏపి సీఐడీ కేసు నమోదు చేసింది. అశోక్ బాబు ఎమ్మెల్సీ కాక మునుపు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా పని చేశారు. ఆయన తన సర్వీసు రికార్డులో విద్యార్హత తప్పుగా పేర్కొన్నందుకు గానూ ఫోర్జరీ కేసు నమోదు అయ్యింది. ఆయనపై ఐపీసీ 477, 465 (ఫోర్జరీ) 420 (చీటింగ్) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
TDP MLC: అశోక్ బాబు బీకాం పూర్తి చేయకుండానే
అశోక్ బాబు బీకాం పూర్తి చేయకుండానే ఆయన నకిలీ సర్టిఫికెట్లు పెట్టారన్న అభియోగం మోపారు. కేసు పెండింగ్ లో ఉండగా ఎలాంటి కేసులు లేవని అశోక్ బాబు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అఫిడవిట్ పేర్కొన్నారు. రికార్డులు తారు మారు చేసినందున అభియోగం ఉన్నందున అశోక్ బాబుపై ఏపీ సీఐడీ విచారణకు ఆదేశించాలని లోకాయుక్త గత ఏడాది ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అశోక్ బాబు తన సర్వీసు రికార్డులో బీకాం గ్రాడ్యుయేట్ గా చూపించారని ఏపి కమర్షియల్ టాక్సెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి మేహర్ కుమార్ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని లోకాయుక్త ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
TDP MLC: తప్పుడు సమాచారంపై జాయింట్ కమిషనర్ ఫిర్యాదు
సర్వీసు రికార్డులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది, అధికారులు అశోక్ బాబు విద్యార్హతలపై తప్పుడు సమాచారం నమోదు చేసి అవకతవకలకు పాల్పడ్డారని మేహర్ కుమార్ తెలిపారు. అశోక్ బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గీతామాధురి సీఐడీకి ఫిర్యాదు చేశారు. గీత మాధురి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా అశోక్ బాబు ఏపి ఎన్జీవో సంఘం అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. సమైక్యాంధ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తరువాత టీడీపీలో చేరగా చంద్రబాబు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు.