Cine Director Deva Katta: ఏపి ప్రభుత్వం సినిమా టికెట్ల్ విక్రయం విషయంలో ప్రత్యేక పోర్టల్ ద్వారా అమ్మాలని తీసుకున్న నిర్ణయంపై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మొదటి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలపై తరచు ప్రశంసల ట్వీట్లు చేసే అగ్రనటులు ఎవ్వరూ దీనిపై స్వాగతిస్తున్నట్లు గానీ, వ్యతిరేకిస్తున్నట్లు గానీ ట్వీట్లు చేయలేదు. అయితే సినీ దర్శకుడు దేవకట్టా జగన్ నిర్ణయంపై స్పందించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తప్పంటూ ధైర్యంగా ప్రకటించారు.
ఏపి ప్రభుత్వం సినిమా టికెట్ల విక్రయం కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తమిళనాడులో ఈ సిస్టమ్ అమలులో ఉంది. అక్కడ అమలు అవుతున్న ఈ విధానాన్ని ఎత్తివేయాలని సినీ రంగం నుండి ఎటువంటి డిమాండ్ రాలేదు. దీంతో జగన్ తమిళనాడు తరహా పరిపాలనా విధానంలో భాగంగా తొలుత ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరిచారు. దీని వల్ల ప్రభుత్వానికి విపరీతంగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు తాజాగా అక్కడ సినీ రంగంలో అమలు అవుతున్న ఆన్ లైన్ టికెట్ ల విధానం ఇక్కడ అమలు చేస్తే ప్రభుత్వానికి ప్రయోజనకరంగా, ప్రజలకు ఉపయోగంగా ఉండటంతో పాటు బ్లాక్ మనీ నియంత్రించవచ్చన్న భావనతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజల నుండి పెద్దగా విమర్శలు గానీ వచ్చే అవకాశం లేదు. సినీ రంగానికి చెందిన వారికే ఈ నిర్ణయం కొంత ఇబ్బంది కల్గిస్తుంది. కానీ వీళ్లు నేరుగా ప్రభుత్వంతో పేచీ పెట్టుకోవడానికి సాహసించే పరిస్థితి ఉండదు. దీంతో జగన్ సినీ రంగ ప్రముఖులతో ఎటువంటి చర్చలు జరపకుండానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అగ్ర నిర్మాతలు గానీ ప్రముఖ హీరోలుగానీ ఇంత వరకూ పెదవి విప్పలేదు. అయితే వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య వంటి సినిమాలను చిత్రీకరించిన దర్శకుడు దేవకట్టా స్పందించారు.
ప్రభుత్వరంగ సంస్థలు అయిన రైల్వేస్ వంటి వాటి విషయంలో ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్లు పెట్టి విక్రయించడం సమంజసమే కానీ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన సినిమాల విషయంలో ప్రభుత్వం ఈ పద్ధతి అనుసరించడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దేవకట్టా. ప్రైవేటు కాంట్రాక్టర్ ల మాదిరిగా సినీ నిర్మాతలు కూడా ప్రభుత్వం ముందు తమ డబ్బు కోసం వేచి ఉండాల్సి వస్తుందేమో అని కూడా వ్యాఖ్యానించారు. సినీ నిర్మాతల విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వం సినీ నిర్మాణ విషయంలో బడ్జెట్ కేటాయించి సహకరిస్తుందా అని దేవకట్టా ప్రశ్నించారు.