Cine Politics: ఏపి ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ మధ్య వివాదాస్పదంగా మారిన ఆన్ లైన్ టికెట్ విక్రయ వ్యవహారంలో నటుడిగా తలదూర్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకాకి అయ్యారా? సినీ పరిశ్రమతో పాటు సొంత కుటుంబ సభ్యుల నుండి కూడా పవన్ వ్యాఖ్యలకు మద్దతు లభించడం లేదా? అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకు తాజాగా జరిగిన పరిణామాలు సాక్షాలుగా నిలుస్తున్నాయి. ఏపి సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలపై ఓ రాజకీయ పార్టీ అధినేతగా పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్…ఆన్ లైన్ టికెట్ల విక్రయం ద్వారా సినీ వ్యాపారాన్ని వైసీపీ ప్రభుత్వం తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు చర్యలు తీసుకోవడాన్ని నటుడుగా తప్పుబట్టారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మువీ ప్రీరిలీజ్ ఫంక్షన్ నందు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ ధ్వజ మెత్తడం తీవ్ర సంచలనం అయ్యింది. సినీ పరిశ్రమ కుదుపునకు, వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
Read More: Perni Nani: పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారన్న మంత్రి పేర్ని నాని..!!
Cine Politics: చప్పట్లు కొట్టారు సైడ్ అయ్యారు
పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో క్లాప్స్ కొడుతూ పవన్ ను మెచ్చుకున్న సినీ నిర్మాతలే ఆ తరువాత ఆయనకు అండగా నిలబడలేదు. ఆనాడు పవన్ మాట్లాడుతున్న సమయంలో నిర్మాతలు ఎవరూ పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టడం గానీ ఈ అంశం ఇక్కడ మాట్లాడే అంశం కాదనీ కానీ చెప్పలేదు. దీంతో పవన్ కళ్యాణ్ మరింత ఘాటుగా ఏపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు సినీ పరిశ్రమ నుండి మద్దతు లభించి ఉంటే వ్యవహారం మరోలా ఉండేది. కానీ ఇక్కడ సినీ నిర్మాతలు ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదనీ చెప్పేశారు. చివరకు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి కూడా సోదరుడు పవన్ కు బాసటగా నిలవకపోవడం పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. పవన్ కళ్యాణ్ పై ఏపి మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలోనే దిల్ రాజుతో సహా పలువురు నిర్మాతలు మంత్రి పేర్ని నాని నివాసానికి వెళ్లి చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే సందర్భంలో చిరంజీవి కూడా తనతో మాట్లాడి పవన్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారని మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించడం, చిరంజీవి, అల్లు అరవింద్ ల సన్నిహితులైన నిర్మాతలు మంత్రి పేర్ని నానిని కలిసి పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదనీ చెప్పడం పవన్ ఏకాకి అయ్యారు అనేది స్పష్టం అవుతోంది.
ఈ వ్యవహారాన్ని పవన్ వదిలివేసినట్లే
పవన్ కల్యాణ్ నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ వివాదంపై మాట్లాడిన దాని బట్టి చూస్తే సినీ పరిశ్రమ సమస్యను వదిలివేసినట్లే కనబడుతోంది. సినీ రంగం నుండి తనకు మద్దతు లభించకపోవడంతో పవన్ కల్యాణ్ ఆ విషయాన్ని వదిలివేయడానికి నిర్ణయించుకున్నారు. సినిమా టికెట్ లు ప్రభుత్వం అమ్ముకుంటే నాకు వచ్చే నష్టం ఏమి లేదన్నారు. నాకు ఏమైనా సినిమా థియేటర్ లు ఉన్నాయా? ఏపిలో థియేటర్ లు నిర్వహించుకునేది ఎక్కువ శాతం వైసీపీ వాళ్లే కదా..! నాకేమిటి నష్టం అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ప్రైవేటు పెట్టుబడులతో నడిచే సినిమా రంగాన్ని ప్రభుత్వం తమ నియంత్రణలో పెట్టుకోవాలని చూడటాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని పవన్ అన్నారు.