AP Telangana Water War: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాలు ఇప్పటికే ఇటు కృష్ణా బోర్డుకు, అటు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకున్నారు. అక్కడ సమస్య పరిష్కారం అలస్యం అవుతుండటంతో ఇరు రాష్ట్రాలు కోర్టులను కూడా ఆశ్రయించాయి. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పడిన జల వివాదంపై ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శ్రీశైలం ప్రాజెక్టుకు నిర్ధేశిత నీటి మట్టం చేరకమునుపే తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్వాదన జరుపుతోందనీ, దీనిని ఆపాలని డిమాండ్ చేస్తున్న ఏపి ప్రభుత్వం.. జల వివాదం పై జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
AP Telangana Water War: జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు
ఈ పిటిషన్ విచారణ సందర్భంలో జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. బోర్డు పరిధిని నిర్ణయిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినందున ఏపి పిటిషన్ ను విచారణ కు స్వీకరించరాదంటూ తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది సుప్రీం కోర్టును కోరింది. అక్టోబర్ నుండి గెజిట్ అమల్లోకి వస్తుందని, ఈ లోపు నీటిని తెలంగాణ వాడుకునే అవకాశం ఉన్నందున తక్షణం గెజిట్ అమలు చేయాలని ఏపి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నాలుగు నెలల పాటు నీటిని నష్టపోకూడదనే అడుగుతున్నట్లు చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ ఎన్వీ రమణ..కృష్ణా జలాల వివాదంపై గతంలో వాదించిన అనుభవం దృష్ట్యా మధ్యవర్తిత్తవం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచన చేశారు.
దానిపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు ఏమిటో తెలపాలని ఆదేశించారు. తాను ఇరు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిననీ, ఈ పిటిషన్ విచారణ అనివార్యమైతే వేరే బెంచ్ కు పిటిషన్ ను బదిలీ చేస్తానని చెప్పారు. మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యమైతేనే తాను ఈ విషయాన్ని చేపడతానని జస్టిస్ వెంకట రమణ స్పష్టం చేశారు. తదుపరి విచారణను బుధవారంకు వాయిదా వేశారు. జస్టిస్ వెంకట రమణ సూచనపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.