ఏపి రాజధాని ప్రాంతం వెలగపూడి ఎస్సీ కాలనీలో ఇరువర్గాల ఘర్షణ కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఓ వర్గానికి చెందిన వారు ఘర్షణలో మృతి చెందిన మరియమ్మ మృతదేహాంతో సోమవారం ఉదయం నుండి రాత్రి వరకూ రోడ్డుపై భైటాయించి ఆందోళన నిర్వహించారు. నిన్న ఉదయం హోంమంత్రి మేకతోటి సుచరితతో సహా ఎంపీ, ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆందోళన విరమించాలని కోరినా వారు వినలేదు. ఈ ఘర్షణల వెనుక ఎంపీ నందిగం సురేష్ హస్తం ఉందనీ, ఆయనపై కేసు నమోదు చేయాలంటూ బాధితులు ఆందోళన కొనసాగించారు. గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో పికెట్ ఏర్పాటు చేశారు.
ఎంపి సురేష్ పై కేసు నమోదుకు హామీ .. అర్థరాత్రి అంత్యక్రియలు
కాగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అర్థరాత్రి ఎస్సీ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. బాధిత వర్గాల డిమాండ్ మేరకు నందిగం సురేష్ పేరును ఎఫ్ఐఆర్ లో చేరుస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం వారు మరియమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
తుళ్లూరు సిఐ ధర్మేంద్ర బాబుపై వేటు
మరో పక్క వెలగపూడి ఘర్షణలో తుళ్లూరు సీఐ ధర్మేంద్ర బాబుపై వేటు పడింది. ఆయనను విఆర్కి బదిలీ చేస్తూ గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వెలగపూడి ఘర్షణలో సీఐ ధర్మేంద్రబాబుపై బాధితులు ఆరోపణలు చేశారు. దీంతో ఆయనను బదిలీ చేశారు.
విషయం ఏమిటంటే..
వెలగపూడి ఎస్సీ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్డు ఆర్చికి పేరు పెట్టే విషయంలో ఇటీవల ఇరువర్గాల మధ్య విబేధాలు తలెత్తాయి. బాబూ జగజ్జీవన్ రామ్ పేరు పెట్టాలని ఓ వర్గం సూచించగా మరో వర్గం దానిని తిరస్కరించింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను నచ్చజెప్పి పంపించారు. అయితే ఆదివారం రాత్రి మరో మారు ఆర్చికి పేరు విషయంపై చర్చించేందుకు ఇరువర్గాలు సమావేశమైయ్యాయి. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి రాళ్ల దాడి వరకూ వెళ్లింది. దీంతో పది మందికిపైగా గాయాలు అయ్యాయి. ఈ ఘర్షణలో గాయపడిన మరియమ్మ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.