CM Jagan Delhi Tour: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటన మరో సారి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఏపి సీఎం వైఎస్ జగన్.. ప్రధాన మంత్రి మోడీతో పాటు నలుగురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై వినతి పత్రాలను అందించారు. నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న సీఎం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు ప్రధాన పెండింగ్ సమస్యలను ప్రధాన మంత్రి మోడీ దృష్టికి సీఎం జగన్ తీసుకువెళ్లారు. పెండింగ్ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు
CM Jagan Delhi Tour: నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, అమిత్ షాతో
అనంతరం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, హోంశాఖ మంత్రి అమిత్ షాతో విడివిడిగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, సవరించిన పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం, రెవెన్యూ లోటు భర్తీ, రుణ పరిమితి పెంపు తదితర అంశాలను జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తదుపరి గజేంద్ర సింగ్ షెకావత్ జరిగిన భేటీలో పోలవరం పనులు త్వరగా పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన పోలవరం అంచనాలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాంపొనెంట్ వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టు పనులు పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలని కోరారు. నిర్వాసిత కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. తదుపరి అమిత్ షా భేటీలో విభజన హామీలపై చర్చించి త్వరగా పరిష్కరించాలని కోరారు.
నితిన్ గడ్కరీతో
కాగా ఈ రోజు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. రాష్ట్రానికి సంబంధించి కీలక రోడ్డు ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖ నుండి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతో పాటు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రాజెక్టు తీర్చిదిద్దేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు. విజయవాడలో బైపాస్ ల నిర్మాణంపై చర్చించారు. రాష్ట్రంలో 20 ఆర్వోబీలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక నోడళ్లు, స్పెషల్ ఎకనమిక్ జోన్లను కలుపుతూ 1723 కిలో మీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
జగన్ విజ్ఞప్తులపై సానుకూల స్పందన
కాగా గడ్కారీతో భేటీతో ముగిసిన తరువాత సీఎం జగన్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ ఏడాది ఢిల్లీ పర్యటనకు వెళ్లడం జగన్ ఇది రెండవ సారి. జనవరిలో ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు అయిదుగురు మంత్రులను కలిసి వచ్చారు జగన్. అదే మాదిరిగా ఈ సారి కూడా పీఎంతో సహా నలుగురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించి సమస్యలపై చర్చించారు. జగన్ విజ్ఞప్తులపై మంత్రులు సానుకూలంగా స్పందించారని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో జగన్ ఢిల్లీ టూర్ ఈ సారి కూడా సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.