CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి హస్తినకు బయలుదేరి వెళుతున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాన మంత్రి మోడీతో సిఎం జగన్ చర్చించనున్నారని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. రాజధాని అమరావతిపై కేంద్ర బీజేపీ స్టాండ్ మార్చుకోవడం, ఇటీవల విజయవాడలో బీజేపీ నిర్వహించిన జనాగ్రహ సభలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బెయిల్ పై ఉన్న నేతలు జైలుకు వెళతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మరో పక్క సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై విపక్షాలు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ఇతర అవసరాలతో పాటు ప్రధానంగా కాసులు, కేసుల కోసం సీఎం జగన్ ఢిల్లీకి వెళుతున్నారంటూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.
CM Jagan Delhi Tour: 15 వేల కోట్లు కావాలి
ఎఫ్ఆర్బీఎం యాక్ట్ ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరానికి (2021-22) రూ.44,396 కోట్లు రుణ పరిమితి తీసుకోవచ్చని కేంద్రం ఏపికి ఇచ్చింది. ఇప్పటికే రూ.36,028 కోట్లు డిసెంబర్ నెలాఖరుకు ఏపి వినియోగించుకుంది. జనవరి నుండి మార్చి నెలాఖరు వరకూ రూ.8368 కోట్లు మాత్రమే రుణం తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ అంచనాల ప్రకారం జనవరి మాసానికి రూ.5 వేల కోట్లు, ఫిబ్రవరి మాసానికి రూ.11 వేల కోట్లు, మార్చి నెలకు రూ.7వేల కోట్లు మొత్తం రూ.23వేల కోట్లు రాష్ట్రానికి అవసరం ఉంది. పరిమితి మాత్రం రూ. 8368 కోట్లు ఉంది. ఈ మూడు నెలల కాలానికి ప్రభుత్వానికి రూ.15వేల కోట్లు కావాలి, దీనికి కేంద్రం మినహాయింపు ఇస్తే తప్ప రాష్ట్రంలో రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అని తులసీి రెడ్డి పేర్కొన్నారు. మిగతా అంశాలతో పాటు ప్రధానంగా ఈ రుణ పరిమితి పెంపు కోసం (కాసుల కోసం) అని ఆయన అన్నారు. ఇక జవదేకర్ చేసిన వ్యాఖ్యలపైనా మోడీతో మాట్లాడే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి.
ఇక ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ ఇటీవల లేఖ రాసింది. ఈ నెల 12న జరిగే సమావేశానికి రావాలని ఇరు రాష్ట్రాల సీఎస్ లు హజరుకావాలని లేఖలో పేర్కొంది. ఈ సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకోంది. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర విషయాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి.