CM Jagan: పట్టణ ప్రాంతాల్లో టిడ్కో గృహ నిర్మాణాలకు గత టీడీపీ హయాంలో లబ్దిదారులు డబ్బులు చెల్లించారు. అత్యాధునిక వసతులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లు ఇక సొంత అవుతాయని లబ్దిదారులు ఎదురుచూస్తున్న తరణంలో ఎన్నికలు వచ్చాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టిడ్కో గృహ నిర్మాణాలు పూర్తి చేసే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో 2.62 లక్షల గృహ నిర్మాణాలను చేపట్టింది. ఒక్కో సముదాయంలో వెయ్యి నుండి పది వేల వరకూ గృహాలు ఉన్నాయి.
CM Jagan: ఈ నెలలో 45 వేల గృహాల పంపిణీ
గృహ సముదాయాల్లో చిన్న చిన్న వసతుల కల్పన మినహా ఇళ్ల నిర్మాణాలు ఎన్నికలకు ముందే పూర్తి అయ్యాయి. నిర్మాణం పూర్తి అయిన ఇళ్లు లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ఇంత వరకూ పట్టించుకోలేదు. ఇళ్లు ఎప్పుడు కేటాయిస్తారా అంటూ లబ్దిదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. నిర్మాణాలు పూర్తి అయిన టిడ్కో గృహాలను పంపిణీ చేయాలంటూ లబ్దిదారులు స్థానిక ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకువస్తూ ఉన్నారు. లబ్దిదారుల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో త్వరలోనే ఆ గృహాలను పంపిణీ చేస్తామని ప్రకటించింది. పూర్తి అయిన గృహాలను ఎక్కడికక్కడ వారికి అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి విడతగా ఈ నెలలో 45 వేల గృహాలను లబ్దిదారులకు అందించనున్నారు.
గృహ సముదాయాల్లో ఇప్పటికే రహదారులు, తాగునీటి సౌకర్యం, మురుగు కాల్వలు, విద్యుత్ ఏర్పాటు జరిగి నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను తొలి విడతలో లబ్దిదారులకు అందించాలని నిర్ణయించారు. ఒక్కో సముదాయం లో 50 నుండి 3వేల వరకూ ఇలాంటి గృహాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో 12వేలు, గుంటూరులో 10వేలు, కర్నూలులో 8వేలు, తూర్పు గోదావరిలో 6వేలు, పశ్చిమ గోదావరిలో 5వేలు, విశాఖ జిల్లాలో 4వేల గృహాలు పంపిణీకి సిద్దంగా ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటినీ ఈ నెల 15వ తేదీ నుండి 25వ తేదీ లోపు లబ్దిదారులకు అందించేలా కార్యాచరణ సిద్దం చేశారు. రెండున్నర సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ లబ్దిదారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరి కొద్ది రోజుల్లో తమ సొంతింటి కల నెరవేరుతోందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.