YS Jagan: ‘సీఎం జగన్ మోహన్ రెడ్డి 2024 మాత్రమే కాదు.. 2029లో కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు’ మంత్రులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు నిత్యం చెప్పే మాట ఇది. సంక్షేమ పధకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న తమ నాయకుడిపై వారికి ఉన్న నమ్మకం ఇలా చెప్పిస్తుంది. అంతిమంగా ఓటు ద్వారా ప్రజలు ఇచ్చే తీర్పుకు ఎవరైనా లోబడాలి. అయితే.. వారి నమ్మకానికి తగ్గట్టగానే ప్రభుత్వం, పార్టీ పరంగా మరో రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్న సీఎం జగన్ తగిన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. ఇందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అంటున్నారు. అందుకోసం పక్కా వ్యూహాలతో మూడు టీమ్స్ ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
YS Jagan: ఆ రెండు టీమ్స్ తోపాటు..
సీఎం జగన్ ఆదేశాల ప్రకారం రెండు టీమ్ లను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ టీమ్ ఒకటి, పార్టీ టీమ్ ఒకటి. వీరికి పీకే టీమ్ జత కలుస్తుంది. 2024 ఎన్నికల్లో గెలుపైనా, ఓటమైనా వీరిదే ప్రధాన పాత్ర కాబోతోంది. ప్రభుత్వపరంగా.. త్వరలోనే ఏపీ క్యాబినెట్ లో మార్పులు చేసి ఉగాదికి కొత్ మంత్రివర్గం ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఉగాదికి ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా తెలుస్తోంది. రెండో టీమ్ పార్టీ అంతర్గత వ్యవహారాల కోసం 15 మందితో పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతమున్న మంత్రుల్లో ఒకరిని తప్పించి ఈ కమిటీకి చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. మంత్రుల స్థాయిలో కమిటీకి హోదా ఇచ్చి జిల్లా, నియోజకవర్గస్థాయిలో పార్టీని బలోపేతం చేయనున్నారు.
2024లో మళ్లీ అధికారమే లక్ష్యంగా..
మరోవైపు ప్రశాంత్ కిశోర్ టీమ్ కూడా వైసీపీకి పని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రశాంత్ కిశోర్ నేరుగా పని చేయడం లేదు. పీకే టీమ్ మాత్రమే జిల్లా, నియోజకవర్గస్థాయిల్లో వైసీపీకి అనుబంధంగా రిపోర్ట్ ను పార్టీకి అందజేస్తుంది. వీరి కోసం ప్రస్తుతం జిల్లాల ఇంచార్జిలుగా ఉన్న విజయసాయిరెడ్డి, సజ్జల, అయోధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల్లో ఒకరిద్దరిని పీకే టీమ్ లకు అనుసంధానం చేయనున్నారు. మంత్రులతో కలిసి వీరు పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేస్తారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రాంతీయ పార్టీగా వైసీపీ చేస్తున్న ప్రయోగం కొత్త తరహా ప్రయత్నమనే చెప్పాలి.