CM Jagan: ఈ నెల 29వ తేదీ నుండి డిసెంబర్ 23 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ లో వైసీపీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం నాడు వైసీపీ పార్లమెంట్ సభ్యులతో సమావేశమైయ్యారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ స్టాండ్ మారిందా..? జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ సభ్యులు గతంలో మాదిరిగా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తారా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా, మరో పక్క రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటి వరకూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు వైసీపీ సహకరిస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదంలో వైసీపీ తమ సహకారాన్ని అందిస్తూ వస్తోంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కాకపోయినా వైసీపీ ఆ రీతిలోనే సహకరిస్తున్నది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఏమైనా మార్చుకున్నదా ? అన్న సందేహం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది.
CM Jagan: అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతు ఇచ్చిన బీజేపీ
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా అమరావతి నుండి ప్రారంభమైన మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో పూర్తి అయ్యే రాష్ట్రంలోని బీజేపీ నేతలు సంఘీభావం తెలియజేయలేదు. గతంలో అమరావతి రాజధానికే బీజేపీ కట్టుబడి ఉందని తీర్మానం చేసినా అమరావతి రైతుల నిరసన కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో అమరావతి రైతుల నిరసన, ఉద్యమాలలో గట్టిగానే మాట్లాడారు. పాల్గొన్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అమరావతి రైతుల ఉద్యమానికి పెద్దగా ఊతం ఇచ్చిన్నట్లు లేదు. అయితే ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనకు విచ్చేసిన సందర్భంలో ఈ విషయం గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఎందుకు పాల్గొనడంలేదని ప్రస్తావించినట్లు సమాచారం. రైతుల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా పాల్గొని సంఘీభావం తెలియజేయాలని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారుట. దీంతో అమరావతి రైతుల మహా పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రారంభం అయిన మొదటి రోజే బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఓ పక్క మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర వైసీపీ నేతలు మంత్రులు ఇది రైతుల పాదయాత్ర కాదనీ, టీడీపీ నడిపిస్తున్న పెయిడ్ వర్కర్స్ పాదయాత్రగా విమర్శస్తున్నారు. రైతుల పాదయాత్రను అధికార వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ వారికి మద్దతుగా పాల్గొనడం, మరో పక్క రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ ను ప్రతి విషయంలోనూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. దీంతో వైసీపీ తన స్టాండ్ మార్చుకున్నదా ? అన్న సందేహం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది.
తాము ఏ కూటమిలో లేము
దానికి తోడు వైసీపీ పార్లమెంట్ సభ్యుల భేటీలో ప్రజా సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నట్లుగా సీఎం వైఎస్ జగన్ కీలక సూచనలు చేశారని వార్తలు వస్తున్నాయి. సమావేశం అనంతరం విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు దానికి బలం చేకూరుస్తున్నట్లుగా ఉన్నాయి. సీఎం జగన్ తో భేటీ అనంతరం వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని తెలిపారు. సమావేశాల్లో పలు అంశాలపై ఎలా స్పందించాలో సీఎం వైెఎస్ జగన్ దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. తాము ఏ కూటమిలో లేమని, తమది ప్రజల కూటమి అని సీఎం జగన్ చెప్పారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతిష్టను నిలబెట్టేలా పార్లమెంట్ లో వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు. కేంద్రం ఏపిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు రూ.55వేల కోట్ల ఆమోదం, ఆహార భద్రతా చట్టం ద్వారా ఏపి జరుగుతున్న అన్యాయం, తెలంగాణ నుండి ఏపి ప్రభుత్వానికి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇలా ఉన్న అనేక అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.