PRC: ఏపి ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీతో సహా ఇతర సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతోంది. సంక్రాంతి పండుగకు ముందే సీఎం జగన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భాగంగానే నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ జరగనుంది. నేడు ఉద్యోగ సంఘాలతో భేటీ నేపథ్యంలో నిన్న ఉద్యోగుల పిఆర్సీ అంశంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హజరైయ్యారు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సారాంశాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ కు అధికారులు వివరించారు.
PRC: ఆర్ధిక శాఖ అధికారులతో చర్చించిన సీఎం జగన్
ఉద్యోగుల డిమాండ్ల పై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. ఎంత మేరకు ఫిట్ మెంట్ ఇవ్వవచ్చు అనే విషయంపై చర్చలు జరిపారు. ఫిట్ మెంట్ ఎంత శాతం ఇస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుంది అనే విషయాలపై సీఎం జగన్ కు అధికారులు నివేదిక ఇచ్చారు. గత నెలలో పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఏమి తేల్చకపోవడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఎందుకు అవకాశం కల్పించడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా సీఎంతో చర్చలకు అయితే ఇక వస్తాం లేకపోతే సమావేశాలకు అహ్వానించవద్దని కూడా తెగేసి చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 9వ తేదీన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు.
పిఆర్సీ పై నేడు స్పష్టత..?
ఈ నేపథ్యంలో పీఆర్సీ సమస్యను ఇక నాన్చకుండా తేల్చేయాలని సీఎం జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు డిమాండ్ చేసింది, సీఎస్ కమిటీ సిఫార్సు చేసింది కాకుండా ఉద్యోగులకు కొంత మేర లాభం జరిగేలా ప్రభుత్వంపై మరింత భారం పడకుండా మధ్యేమార్గంగా షటిల్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ రోజు జరిగే సమావేశంలోనే పిఆర్సీ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.