CM Jagan: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5లక్షల వంతున ఎక్స్ గ్రేషియాకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు సీఎం జగన్ ఆదేశించారు.
CM Jagan: బస్సు ప్రమాదంలో 8 మంది మృతి
వేలేరుపాడు నుండి జంగారెడ్డిగూడెం వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు జల్లేరు వాగులో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చిన్నారావుతో సహా 8 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలైయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో 47 మంది ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణీకులను పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఆర్డీవో, డీఎస్పీలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.
ప్రమాదంపై విచారణకు ఆదేశించిన మంత్రి పేర్ని నాని
ప్రమాదం విషయం తెలియగానే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జంగారెడ్డిగూడెం బయలుదేరి వెళ్లారు. కాగా బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని మంత్రి నాని చెప్పారు. వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.