YS Jagan: సంక్షేమ పధకాలపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం కరోనా సమయంలో కూడా ఎక్కడా వాటికి కోత పెట్టకుండా ప్రజలకు అందించింది. ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి పెట్టడంతో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే సంక్షేమంపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది విద్యుత్ రంగం. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా కరెంటు కోతలు అమలవుతున్నాయి. ప్రధానంగా రైతులు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మెట్ట ప్రాంతంలో వేసే పసుపు, మొక్కజొన్న వంటి పంటలకు నీరందక రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సంక్షేమ పథకాలకు వేల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం డిస్కమ్ ల చెల్లింపుల్లో అలసత్వం వల్లే ఈ సమస్య వచ్చిందని తెలుస్తోంది.
వ్యవసాయానికి విద్యుత్ కోతలు..
రెండు దశాబ్దాల క్రితం విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండేవి. రానురానూ విద్యుత్ కోతలు తగ్గాయి. గృహాలకు, వ్యవసాయ విద్యుత్ నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే.. దేశంలో బొగ్గు సరఫరా గతంతో పోలిస్తే తక్కువగానే ఉందన్నది నిజం. కానీ.. ఏపీలో ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వ దూరదృష్టి లోపమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్టీపీసీకి 350 కోట్లు విద్యుత్ బకాయిలు ఉండగా.. కనీసం 30 కోట్లు చెల్లించాలని కోరినా చెల్లించలేదని.. అందుకే విద్యుత్ కోతలు పెరిగాయని అంటున్నారు. జిల్లా కేంద్రాల్లో 2-3, మండల కేంద్రాల్లో 6-7 గంటల కోతలు అమలవుతున్నాయని తెలుస్తోంది. ఎన్టీపీసీ ఎన్ని లేఖలు రాసినా డిస్కంల నుంచి స్పందన లేకపోవడంతో ఏపీకి 800 మెగావాట్ల విద్యుత్ నిలిపివేసినట్టు తెలుస్తోంది.
గత ముఖ్యమంత్రులు ఇలా..
బహిరంగ మార్కెట్లో కూడా విద్యుత్ కొనే అవకాశం లేకుండా చేసినట్టు తెలుస్తోంది. వ్యవసాయరంగ పరిస్థితులపై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉంటుందనేది నిజం. బోర్ల మీద వ్యవసాయం ఎక్కువగా జరుగుతున్న పరిస్థితుల్లో వ్యవసాయానికి విద్యుత్ అందకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇది ప్రభుత్వానికి నష్టం. రైతు భరోసాతో ప్రభుత్వం రైతులకు మేలు కలిగించినా క్షేత్రస్థాయిలో జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయకపోతే ఫలితం ఉండదు. గతంలో రైతులకు వ్యతిరేకంగా వెళ్లిన చంద్రబాబు గద్దె దిగడం, ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అవడం.. ఆ హామీ నెరవేర్చడం కూడా జరిగింది. కాబట్టి.. రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగుతుందా..? చూడాలి.