ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో గత కొంత కాలంగా మంత్రి జోగి రమేష్, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నియోజకవర్గ వైసీపీలోని పరిస్థితి పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వద్దకు కూడా వెళ్లింది. గత కొద్ది నెలలుగా వివిధ నియోజకవర్గాల వైసీపీ కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్న సీఎం వైఎస్ జగన్ .. ఈ రోజు మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో నియోజకవర్గంలో ఇప్పటి వరకూ లబ్దిదారులకు అందిన సంక్షేమాన్ని వివరించిన సీఎం జగన్ .. వచ్చే ఎన్నికల్లోనూ గతం కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధించి రావాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సూచించారు. ఈ సారి మన లక్ష్యం 175 కి 175 స్థానాల్లో విజయం సాధించడమేననీ, దీని కోసం అంతా కృషి చేయాలని అన్నారు. పార్టీలో చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు పక్కన బెట్టి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణకృష్ణ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మైలవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ తనకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని, తమ వద్ద నుండి కూడా గ్రామాల్లో పరిస్థితిపై సమాచారం తీసుకున్నారని తెలిపారు. తాము చెప్పిన విషయాలు అన్నీ సీఎం జగన్ నమోదు చేసుకున్నారన్నారు.
చిన్న చిన్న విభేదాలు ఉంటే సర్దుకుని గత ఎన్నికల్లో వచ్చిన దాని కంటే ఎక్కువ మెజార్టీలో విజయం సాధించి రావాలని చెప్పారన్నారు. ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకోవాలని సూచించారన్నారు. తన స్థాయిలోనూ కూర్చోబెట్టి మాట్లాడతానని చెప్పారని తెలిపారు. కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయనీ, అన్నీ పరిష్కారం అవుతాయని వసంత ఆశాభావం వ్యక్తం చేసారు. వచ్చే వారంలో కూర్చుంటామనీ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయమే శిరోధార్యమని వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కాగా మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మద్య విభేదాలపై స్వయంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డే జోక్యం చేసుకోవడంతో మరో వారం రోజుల్లో దీనికి ఏ విధంగా ముగింపు పలుకుతారనేది ఆసక్తికరంగా మారింది.