CM YS jagan: ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరి కొందరు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వెంటనే స్పందించారు. ఘటనపై తీవ్ర తీవ్ర దిగ్భాంత వ్యక్తం చేస్తూ మృతి చెందిన కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల వంతున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షల వంతున, గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం జగన్. ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
బుధవారం అర్ధరాత్రి ఫ్యాక్టరీలో జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కాగా 13 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులు నూజివీడు, విజయవాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఫ్యాక్టరీలోని నాల్గవ యూనిట్ లో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.