YS Jagan : ఏపీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇది. ఏపీ సీఎం ప్రతిష్టాత్మక నిర్ణయానికి కేంద్రం ఊహించని రీతిలో బ్రేక్ వేసింది. అయితే, ఈ నిర్ణయం అధికారికంగా వెలువరించలేదు. తాజాగా మరో రూపంలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావించిన కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడింది. ఆర్టీఐ ద్వారా ఈ జిల్లాల పునర్విభజన అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో ఏపీ సర్కారు ఏం చేయనుందనే టాక్ వినిపిస్తోంది.
సీఎం జగన్ ఏం డిసైడయ్యారు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో అధికార టీఆర్ఎస్ సర్కార్ పది జిల్లాలను కాస్త 33 జిల్లాలు గా విభజించిన విషయం తెలిసిందే. దీంతో అందరి చూపు ఏపీపై పడింది. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని జగన్ సీఎం అయిన నాటి నుండి భావిస్తున్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలతో పాటు కొత్తగా మరో 12 జిల్లాలు ఏర్పడనున్నాయి. గత ఏడాది ఆగస్టు నెలలో జిల్లాల పునర్విభజనకు ఏర్పాటు చేసిన కమిటీకి ప్రత్యేక సబ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆగస్టు 22న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కమిటీ ఏం చేసింది?
కమిటీ ఏర్పాటులో భాగంగా, జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం బాధ్యతను మొదటి సబ్ కమిటీకి అప్పగించారు. సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలు రెండో ఉప సంఘం చూడనుంది. మూడో సబ్ కమిటీకి ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనం విధులు అప్పగించారు. సాంకేతిక సంబంధిత అధ్యయనాన్ని నాలుగో సబ్ కమిటీకి కేటాయించారు. రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు సహాయం కోసం జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. చైర్మన్గా కలెక్టర్తో పాటు 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ఉన్నత స్థాయి కమిటీ నాలుగైదు సార్లు ఇప్పటికే భేటీ అయింది. అయితే కరోనా, ఎన్నికల హడావుడి కారణంగా కొంత కాలంగా భేటీ ఉన్నత స్థాయి కమిటీ భేటీ కాలేదు. అయితే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేకులు పడినట్టు చెబుతున్నారు.
ఆర్టీఐ ఏం చెప్తోందంటే….
జన గణన పూర్తి కాకపోవడంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు అడ్డంకి ఏర్పడిందని అంటున్నారు. జనగణన పూర్తయ్యేంత వరకు గ్రామాలు, మండలాలు, జిల్లాల సరిహద్దులను ఫ్రీజ్ చేయాలని గతంలోనే కేంద్రం ఆదేశించింది. అయితే కరోనా కారణంగా జనగణన పూర్తి కాలేదు. దీంతో మరో ఏడాది, ఏడాదిన్నర వరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్లు పడే అవకాశం కనిపిస్తోంది.