CM YS Jagan: అధికార వైసీపీలో పదవుల సందడి..హడావుడి మొదలైంది. పార్టీ ఆవిర్భావం తరువాత ఇంత స్థాయిలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ అవకాశం ఎప్పుడూ రాలేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు, నాలుగు ఎమ్మెల్సీ స్థానాల అవకాశమే వచ్చేది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా మూడు నాలుగు నెలల క్రితం గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీలు, అంతకు ముందు నాలుగు ఎమ్మెల్సీలను భర్తీ చేసే అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు మొదటి సారిగా 14 ఎమ్మెల్సీ పదవులను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి భర్తీ చేయనున్నారు. శాసన మండలిలో 14 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.
CM YS Jagan: స్థానిక సంస్థల కోటాలో 11, ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీలు
వాటిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో 11, ఎమ్మెల్యేల కోటాలో మూడు ఉన్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 90 శాతం వైసీపీ గెలుచుకున్న కారణంగా స్థానిక సంస్థల కోటాలోని 11 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకే దక్కబోతున్నాయి. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్యా ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీలు వైసీపీకే దక్కనున్నాయి. మొత్తానికి 14 కి 14 వైసీపీ భర్తీ చేసుకోనున్నది. దీంతో మండలిలో వైసీపీ బలం పెరుగుతుంది. దాంతో మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కూడా అధికార పార్టీ ఖాతాలోకి రానున్నాయి. ఖాళీగా ఉన్న 14 ఎమ్మెల్సీ పదవులకై వైసీపీలో అంతర్గతంగా సంప్రదింపులు, చర్చలు, లాబీయింగ్ లు జరుగుతున్నాయి.
ఉమ్మారెడ్డికి మండలి చైర్మన్..?
అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టనున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కూడా ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే జిల్లాల వారీగా నేతల పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్, నెల్లూరు జిల్లా నుండి బీద మస్తాన్ రావు, చిత్తూరు జిల్లా నుండి భరత్ లేదా హరిప్రసాద్ రెడ్డి, విశాఖ జిల్లా నుండి వరుదు కళ్యాణి, కృష్ణాజిల్లా నుండి యార్లగడ్డ వెంకట్రావు లేదా డాక్టర్ దుట్టా రామచంద్రరావు, అనంతపురం జిల్లా నుండి వై లక్ష్మీదేవి, ప్రకాశం జిల్లా నుండి ఆమంచి కృష్ణమోహన్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. కాగా వీరిలో మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని గతంలోనే సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఆయనను కేబినెట్ లోకి తీసుకునేందుకు ఎంపిక చేస్తున్నారని అనుకుంటున్నారు. అదే విధంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కి ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాలని ఆలోచన చేస్తున్నారుట. అయితే బద్వేల్ ఉప ఎన్నిక అనంతరం ఎమ్మెల్సీ పదవుల భర్తీకి మూహూర్తం ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే మంత్రివర్గ ప్రక్షాళన చేయనున్నారు.