CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కేబినెట్ లోని మొత్తం 24 మంది మంత్రులు నిన్న రాజీనామాలు సమర్పించిన సంగతి తెలిసిందే. మంత్రి వర్గ విస్తరణకు ఈ నెల 11వ తేదీ ముహూర్తం ఫిక్స్ చేసిన నందున సీఎం జగన్ సూచనలతో మొత్తం అందరూ నిన్న కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే రాజీనామా లేఖలు అందించారు. ఆ సమయంలో ప్రస్తుత కేబినెట్ లో పని చేసిన వారిలో నలుగురు లేదా అయిదుగురిని మళ్లీ తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పాత వారిని ఎవరెవరిని కొనసాగిస్తారు..? కొత్తగా ఎవరెవరిని తీసుకుంటారు..? అనే దానిపై ఊహగానాలు సాగుతున్నాయి. రకరకాల పేర్లు మీడియాలో వచ్చేస్తున్నాయి.
CM YS Jagan: సీనియర్ లకు ఛాన్స్
అయితే సీఎం జగన్మోహనరెడ్డి మంత్రివర్గ విస్తరణ విషయంలో తన ఆలోచనను మార్పు చేసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణ నేపథ్యంలో ముగ్గురు నలుగురుని కొనసాగించి మొత్తం కొత్త వారిని తీసుకుంటే, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పే సీనియర్ మంత్రులు లేకపోతే ఇబ్బంది ఎదురవుతుందని భావించి పలువురు సీనియర్ లను కొనసాగించాలని భావిస్తున్నారని వైసీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
పాత వారిలో పది మందికి
సామాజిక వర్గ సమీకరణలు ఇతర కారణాలతో సిదిరి అప్పలరాజు, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన గోపాలకృష్ణ, గుమ్మడి జయరాం, తానేటి వనిత, అంజాద్ బాషాలను తొలుత కొనసాగించాలని భావించారని సమాచారం. ఇక సీనియారిటీ, ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నానిలను సైతం కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పది మంది పోగా మిగిలిన 14 మందిని జిల్లాల వారిగా పరిశీలన చేసి మంత్రివర్గంలోకి జగన్ అవకాశం కల్పించనున్నారు.