CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఓటిఎస్ లబ్దిదారులకు గుడ్ న్యూస్ అందించారు. పేద వర్గాలకు ఎంతో మేలు చేసే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం జగన్ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో లాంఛనంగా ప్రారంభించారు. తన పుట్టిన రోజున దాదాపు 50 లక్షలకు పైచిలుకు లబ్దిదారులకు ప్రయోజకం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని పేర్కొన్న సీఎం జగన్..వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా లబ్దికలగాలనే ఈ పథకాన్ని వచ్చే ఏడాది ఉగాది వరకూ పొడిగిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు అమ్ముకోవడానికి, తనఖా పెట్టుకోవడానికి, వారసుల పేర రాయడానికి ఎలాంటి హక్కు లేదనీ, బ్యాంకుల్లో రుణం తీసుకోవడానికీ అవకాశం లేదన్నారు. అటువంటి పరిస్థితి మారుస్తూ పూర్తి హక్కులతో ఇంటిని అమ్ముకునే స్వేచ్చను ఇస్తున్నామని అన్నారు. గతంలో ఉన్న వివాదాలన్నీ పరిష్కరించి వివాదరహితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని తెలిపారు. గృహ హక్కు పథకం ద్వారా రాష్ట్రంలో రూ.16వేల కోట్ల రుణ మాఫీ చేస్తున్నామని చెప్పారు. నామమాత్రపు చెల్లింపులతో లబ్దిదారుల ఇంటిని వారికి సొంతం చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి నిరుపేద ఇంటి యజమాని కావడమే ప్రభుత్వ ధ్వేయమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
CM YS Jagan: ప్రతిపక్షాలపై విసుర్లు..
పేదల కోసం ఇంత మంచి పథకాన్ని తీసుకువచ్చి అమలు చేస్తుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం జగన్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో వడ్డీ మాఫీ చేయాలని కోరితే ఆ పని చేయకపోగా ఈ రోజు విమర్శించడం సిగ్గుచేటని జగన్ అన్నారు. పేదలకు మంచి జరుగుతుంటే వాళ్లకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఈ 30 నెలల కాలంలో ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా లబ్దిదారులకు వివిధ పథకాల కింద లక్షా 16వేల కోట్లు వాళ్ల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా పేదవారి సొంతింటి కల నెరవేరుస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అనంతరం జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్దిదారులకు సీఎం జగన్ అందజేశారు.
Read More: Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా కీలక వ్యాఖ్యలు..! రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం..!!