YS Jagan: దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే కరోనా కలకం కొనసాగుతుందో ఏపీలోనూ అదే రీతిలో మహమ్మారి విస్తృతి జరుగుతోంది. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వరుసగా వారుం రోజుల నుండి 2లక్షలకు పైగా కొత్త కేసులు, వేల మరణాలు నమోదవడం కొవిడ్ తీవ్రతను కళ్లకు కడుతోంది. తొలుత ఈ రెండో దశ ఉద్ధృతి మహారాష్ట్రలో ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు చాపకింద నీరులా దేశమంతా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చికిత్సలో కీలకమైన ఆక్సిజన్ అందుబాటు గురించి కీలక నిర్ణయం తీసుకుంది.
సీఎం జగన్ ఆదేశాల మేరకు…
కరోనా పేషేంట్లకు ట్రీట్మెంట్ అందించే సమయంలో ఆక్సిజన్ చాలా ముఖ్యం కావడంతో దాని కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏపీలో ఆక్సిజన్ కొరతపై మంత్రి మేకపాటి నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ఆక్సిజన్ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యామ్నాయం చూపే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఆక్సిజన్ ఉత్పత్తికి అవసరమైన చర్యలపై పరిశ్రమల శాఖ ఫోకస్ పెట్టింది. అలాగే ఎయిర్ సపరేటర్ల కొనుగోళ్లకు మార్గ దర్శకాల జారీ పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ఆక్సిజన్ కొరతకు పరిష్కారం చూపనున్నట్లు సమాచారం.
నేటి నుంచి కరోనా వ్యాక్సిన్….
ఇదిలాఉండగా, ఏపీలో నిలిచిపోయిన వ్యాక్సినేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. అయితే నేడు అందరూ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కోరారు. దాదాపు ఐదు లక్షల కోవిషీల్డ్ , లక్ష కోవాక్సిన్ డోసులు జిల్లాలకు సరఫరా చేశామన్న ఆయన గురువారం ఎవరికీ మొదటి డోస్ వెయ్యరనే విషయాన్ని గమనించాలని గురువారం మాత్రమే రెండో డోస్ వేస్తారని పేర్కొన్నారు. మొత్తంగా ఈ రెండు నిర్ణయాలు కరోనా విస్తృతికి చెక్ పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.