CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణానది కరకట్ట రహదారి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకూ 15.525 కిలో మీటరు మేర చేపట్టనున్న ఈ పనులకు ప్రభుత్వం రూ.150 కోట్ల ఖర్చు చేయనున్నది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండేళ్లకు అమరావతి ప్రాంతంలో వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన మొదటి శంకుస్థాపన ఇది. కృష్ణానది కుడి కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన పైలాన్ ను సీఎం జగన్ ఆవిష్కరించారు.
అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విస్తరణ పనులను మేఘా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టనున్నది. విస్తరణలో బాగంగా పది మీటర్ల వెడల్పుతో రెండు వరసల రహదారితో పాటు ఇరువైపులా రెండు వరుసల నడకదారులను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్సా సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత, రంగనాథరాజు, నారాయణ స్వామి, ఎంపి మోపిదేవి వెంకట రమణ, కలెక్టర్ వివేక్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.