CM YS Jagan: ఏపిలో మంత్రి వర్గ విస్తరణపై చాలా రోజుల నుండి ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం రోజునే రెండున్నరేళ్లకు మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని స్పష్టం చేసిన నేపథ్యంలో కొద్ది నెలలుగా దీనిపై చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం అప్పుడు, ఇప్పుడు అంటూ ఊహగానాలు వచ్చినా కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదన్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి సారిగా మంత్రివర్గ విస్తరణపై నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేటి కేబినెట్ బేటీలో హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు సీఎం చెప్పినట్లు సమాచారం. దీంతో కొందరు మంత్రులు ఇదే మాకు చివరి మంత్రివర్గ భేటీయా అని అనడంతో జగన్ నుండి చిరునవ్వు సమాధానం ఎదురైంది. చాలా మంది ఆశావహులు ఉన్నారనీ, అందరికీ అవకాశం కల్పించాలని జగన్ మంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది.
CM YS Jagan: ప్రస్తుత మంత్రులకు పార్టీ బాధ్యతలు.. ?
ప్రస్తుతం మంత్రులకు జిల్లా బాధ్యతలను అప్పగిస్తాననీ, తిరిగి గెలిపించుకుని వస్తే మీరే కదా మళ్లీ మంత్రులు అని జగన్ అన్నారుట. పార్టీ బాధ్యతలను ప్రస్తుతం ఉన్న మంత్రులే చూసుకోవాలని మంత్రవర్గ సమావేశంలో జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. నేరుగా జగన్ నోటి నుండే మంత్రివర్గ విస్తరణపై మాట రావడంతో వైసీపీ ప్లీనరీకి ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయనే మాట వినబడుతోంది. మంత్రివర్గ విస్తరణపై జగన్ మాట్లాడినట్లు తెలియడంతో ఎవరెవరు మంత్రివర్గంలో ఉంటారు. కొత్తగా ఎవరికి చాన్స్ దక్కుతుంది అనే దానిపై ఎమ్మెల్యేల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.