CM YS Jagan: రాష్ట్రంలో అనేక మంది ప్రభుత్వ ఆసుపత్రిల్లో పని చేసే వైద్యులు ప్రైవేటు క్లినిక్లు, ఆసుపత్రులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై చాలా కాలం నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహిస్తున్న పలువురు ప్రభుత్వ వైద్యులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుకు చెక్ పెట్టేలా ఏపి సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిల్లో విధులు నిర్వహించే ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిరోధించిందేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు నిన్న జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలు హర్షించేది అయినప్పటికీ కొన్ని చిక్కులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
CM YS Jagan: కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా
నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపర్చే దిశగా చర్యలు చేపడుతున్న సర్కార్ ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు వైద్యానికి కళ్లెం వేసేందుకు గానూ స్పష్టమైన నియమ, నిబంధనలు రూపొందించాలని చూస్తోంది. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా తయారు చేయాలని జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని భర్తీకి చర్యలు చేపడుతోంది. నాణ్యమైన మందులను ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తోంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మళ్లీ వైద్యుల కొరత
గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదన్న నిబంధన ఉండేది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఏర్పడటం, ప్రభుత్వ ఆసుపత్రిల్లో పని చేయడానికి వైద్యులు ముందుకు రాకపోవడంతో గతంలో ప్రభుత్వాలు ప్రైవేటు ప్రాక్టీసు నిబంధనల్లో సడలింపులు ఇచ్చాయి. దాంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారి విధుల సమయం పూర్తి అయిన తర్వాత ప్రైవేటు ప్రాక్టీసు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న వైద్యులకు గట్టి షాక్ తగలనుంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు ప్రాక్టీసుకు అలవాటు పడిన ప్రభుత్వ వైద్యులు స్వచ్చంద పదవీ విరమణలకు పూనుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మళ్లీ వైద్యుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ఆ సమస్యను ఎలా అధిగమిస్తుందో చూడాలి.