CM YS Jagan: అధికారంలో ఉన్న రాజకీయ నేతలు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలంటే అందులో రాజకీయ ప్రయోజనం కూడా చూసుకుంటారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఆ నియోజకవర్గ ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీ ఆవిర్భావం నుండి ఆ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధి గెలవలేదు. కానీ ఆ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి, రాజ్యసభ సభ్యుడు మోడిదేవి వెంకట రమణ వినతికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
CM YS Jagan: రెవెన్యూ డివిజన్ కేంద్రంగా రేపల్లె
విషయంలోకి వెళితే.. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో గుంటూరు జిల్లా రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటునకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రేపల్లె నియోజకవర్గం నుండి మోదిదేవి వెంకట రమణ 2009 ఎన్నికల్లో ఒక్కసారే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు 1989,1994లో కూచినపూడి స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయినా ఆ తరువాత జరిగిన 1999,2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మోపిదేవి.. రేపల్లె నుండి 2014,2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. ఇక్కడ టీడీపీ నుండి అనగాని సత్యప్రసాద్ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. మోపిదేవి వెంకట రమణ రెండు పర్యాయాలు రేపల్లే నుండి ఓడిపోయినప్పటికీ అత్యంత సన్నిహితుడు, పార్టీ పట్ల విధేయత కారణంగా జగన్మోహనరెడ్డి 2020లో రాజ్యసభ సభ్యుడుగా పంపారు.
హర్షం వ్యక్తం చేసిన ఎంపి మోపిదేవి
వైసీపీ ఆవిర్భావం తరువాత నియోజకవర్గంలో ఆ పార్టీ గెలవకపోయినప్పటికీ రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ డివిజన్ లో రేపల్లెతో పాటు వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు కొనసాగనున్నాయి. కాగా రేపల్లెను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 74 రెవెన్యూ డివిజన్లు ఉండగా..ఇప్పుడు కొత్తగా రేపల్లె కూడా రెవెన్యూ డివిజన్ గా మారనుండటంతో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 75కు చేరుకోనుంది.