CM YS Jagan: ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న అనేక నిర్ణయాలపై విమర్శలు రావడం, కోర్టు వివాదాలు ఎదుర్కోవడం తెలిసిందే. ఇదే క్రమంలో పలు నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ జగన్మోహనరెడ్డి సర్కార్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కానున్నది. ఓ పక్క రాష్ట్రంలో కరోనా కట్టడికి కర్ఫ్యూ అమలు చేస్తున్నా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. కరోనా మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ప్రభావం లేకపోయినా ఇప్పుడు సెకండ్ వేవ్ లో గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కరోనా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. గ్రామ పంచాయతీల పరిధిలో స్త్రీ పురుషులకు వేరువేరుగా ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలు, లేక ఇతర భవనాలలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటుకు ఉన్న అవకాశాలను గ్రామ కార్యదర్శులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. అనంతరం కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్ లకు అప్పగించనున్నారు. కేసుల సంఖ్య ఆధారంగా బెడ్లు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
ప్రస్తుతం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినా ఎటువంటి లక్షణాలు లేని వారు హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ప్రత్యేకంగా ఉండే సదుపాయాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులను, ఇతరులను కలవడం వల్ల వారు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ప్రతి గ్రామంలో ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్ లు ఏర్పాటు చేయడం వల్ల అనుమానితులను ఈ కేంద్రాలలో ఉంచడం వల్ల వైరస్ స్ప్రెడ్ నిలువరించేందుకు అవకాశం ఏర్పడుతుందుందని అంటున్నారు.