CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమ పథకాలపైనే ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్న హామీలు అమలే ప్రధాన లక్ష్యంగా ఇప్పటి వరకూ పరిపాలన సాగిస్తూ వచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా, వివిధ రూపాల్లో రుణాలు తీసుకువచ్చి మరీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. దీంతో ఆ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం నిలుపుదల చేయకుండా కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు జరగడం లేదు. జగన్మోహనరెడ్డి తీసుకువచ్చిన పలు పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతున్నాయి. ఇంటింటికి రేషన్, గ్రామ సచివాలయ వ్యవస్థ తదితర కార్యక్రమాలపై ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు పరిశీలించి వెళ్లారు.
CM YS Jagan: అదనపు ఆదాయ మార్గాలపై అధ్యయనం చేయాలి
అయితే ఆదాయ మార్గాలను పెంచుకోకుండా సంక్షేమ పథకాలు కొనసాగింపు కష్టతరంగా మారుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న ఈ సమయంలో ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టింది జగన్ సర్కార్. రాష్ట్రానికి ఆర్ధిక వనరులు సమకూర్చే శాఖలతో సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలో అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఎస్ఓఆర్ (రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాలు ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలనీ, తద్వారా రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలనీ, వీటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి దృష్టి పెట్టాలని పేర్కొన్నారు సీఎం జగన్. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖలకు చెందిన అధికారులు క్రమంతప్పకుండా సమావేశాలు కావాలన్నారు.
పారదర్శక విధానాలు పాటించాలి
ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్ లు క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పారు. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కఛ్చితమైన ఎస్ఓపీలను పాటించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న వ్యాట్ కేసులను పరిష్కరించడం ద్వార బకాయిలను రాబట్టుకోవటంపై దృష్టి సారించాలన్నారు. ఇదే క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలని అన్నారు. సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవనీతి, ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదని సూచించారు సీఎం వైఎస్ జగన్.