AP Assembly: అసెంబ్లీ సాక్షిగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పదవ రోజైన మంగళవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ 2023 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ప్రాజెక్టును వైఎస్ఆర్ కు అంకితం చేస్తామని ప్రకటించారు. సీడబ్ల్యుసీ నుండి డిజైన్లు వస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని 18నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టును వైఎస్అర్ ప్రారంభించారనీ, ఆయన కొడుగ్గా తానే పూర్తి చేస్తానని స్పష్టం చేశారు.
AP Assembly: పోలవరానికి చంద్రబాబు పనులే శాపం
ఇదే సందర్భంలో పోలవరం ఎత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన రాద్ధాంతంపైనా విమర్శలు గుప్పించారు. పోలవరానికి చంద్రబాబు పనులే శాపంగా మారాయన్నారు. స్పిల్ వే నిర్మాణంలో చంద్రబాబు తప్పులు చేశారనీ ఆరోపించారు. పోలవరం పూర్తి అవుతుంటే చంద్రబాబుకు కడుపుమంటగా ఉందని అన్నారు. గతంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ జోలికి చంద్రబాబు వెళ్లలేదని విమర్శించారు. డిజైన్ ప్రకారం నదిని కుడివైపునకు మళ్లించాలని, అప్పర్, డౌన్ కాఫర్ డ్యాం నిర్మాణ పనుల్లో కొంత వదిలేశారనీ, దీని వల్ల చాలా నష్టం జరిగిందని జగన్ అన్నారు. వరదల వల్ల 10-25 లక్షల క్యూసెక్కుల నీరు చేరిందనీ, వరద ఉధృతికి డయాఫ్రాం వాల్ బాగా దెబ్బతిన్నదనీ, దీన్ని సరిచేయడానికి రెండేళ్లుగా నిపుణులు ప్రయత్నిస్తున్నారని, ఇదేనా చంద్రబాబు విజయం అని సీఎం ప్రశ్నించారు. పోలవరం ఎత్తు ఇంచ్ కూడా తగ్గదని సీఎం స్పష్టం చేశారు. జాతీయ ప్రాజెక్టేనా పోలవరం విషయంలో కేంద్రంతో ఇన్ని సార్లు మాట్లాడటానికి కారణం చంద్రబాబేనన్నారు. చంద్రబాబు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రాజెక్టును తన చేతిల్లోకి తీసుకున్నారని జగన్ విమర్శించారు.
వంద కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు భజన
2017 వరకూ పోలవరం పనులను చంద్రబాబు గాలికి వదిలివేశారన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టడానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టి బస్సుల్లో జనాలను పోలవరం తరలించారని, జయము జయము చంద్రన్న పాటతో ప్రత్యేకంగా భజన సైతం చేయించుకున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఈ సమయంలో జయము జయము చంద్రన్న పాట ప్లే కాగా సభ మొత్తం నవ్వులు పూశాయి. తమ పాలనలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మెజార్టీ పనులు పూర్తి చేసినట్లు చెబుతూ పూర్తి వివరాలను సభకు వెల్లడించారు సీఎం జగన్. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని, ఇప్పుడు చేస్తున్న కుట్రలకు వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ చంద్రబాబుకు ఓటమి తప్పదని జగన్ జోస్యం చెప్పారు. వక్రీకరణ, అబద్దాలపై అధారపడి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు.