వరద నష్టం అంచనాలు పూర్తి కాగానే బాధితులను ఆదుకుంటామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ మంగళవారం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ముందు గ్రామాల్లో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. శిబిరాల్లో బాగా చూసుకున్నారా.. ప్రభుత్వ తక్షణ సాయం అందిందా.. వాలంటీర్లు, అధికారులు అండగా నిలబడి సేవలు అందించారా అంటూ బాధిత కుటుంబాలను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. శిబిరాల్లో బాగానే చూసుకున్నారని, వాలంటీర్లు సేవలు అందించారని బాధిత కుటుంబాలు సీఎం జగన్ కు తెలిపారు. పుచ్చకాయలవారిపేట, ఊరుమూడి లంక, మేకలపాలెం తదితర గ్రామాల్లో నేరుగా వరద బాధితులతో సీఎం జగన్ ముచ్చటించారు.
తక్షణ సహాయ చర్యలకు ఇబ్బంది కలగకూడదనే..
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ నష్టం అంచనాలు పూర్తి కాగానే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ లో పరిహారం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వరద వచ్చిన సమయంలో తాను పర్యటనకు వస్తే అధికార యంత్రాంగం మొత్తం తన చుట్టూ తిరుగుతుందని, దీని వల్ల సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతాయని వారం రోజుల సమయం ఇచ్చి పర్యటనకు రావడం జరిగిందని వివరించారు జగన్. వరదలు రాగానే ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తక్షణ సహాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. వెంటనే అధికారులు అందరినీ క్షేత్రస్థాయికి పంపి ఎవరు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జగన్ తెలిపారు.
8 నెలల పిల్లవాడికి పెన్ను బహుకరించిన సీఎం జగన్
సీఎం జగన్ కోనసీమ లంక గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో సీఎం జగన్ పెదపూడి లంక గ్రామంలో ఓ 8నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు. ఆ సమయంలో పిల్లవాడు జగన్ జేబులోని పెన్నుతో ఆడుకుంటూ కింద పడేశాడు. ఆ తరువాత పిల్లవాడిని తల్లి తీసుకోగా, జగన్ తన ఖరీదైన పెన్నును పిల్లవాడికి బహుమతిగా ఇచ్చారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
మోడీ సర్కార్ పై విపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్ధి మర్గరేట్ అల్వా సంచలన ఆరోపణలు