CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు విజయవాడలో ఆధునాతన వసతులతో కూడిన 500 వైఎస్ఆర్ తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్ వాహనాలను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దాదాపు 500 కొత్త ఎయిర్ కండిషన్డ్ వాహనాలను రాష్ట్ర నలుమూలలకు ఈ రోజు పంపుతున్నామన్నారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని మొట్టమొదట నుండి ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, ఆ చెల్లెమ్మలు గర్భం దాల్చిన వెంటనే వారికి అండగా ఉంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
అందులో భాగంగానే గర్భవతి అయిన చెల్లెమ్మ 108 కి ఫోన్ చేసిన వెంటనే వాహనం అక్కడకు వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్లడమే కాకుండా నాణ్యమైన సేవలు అసుపత్రిలో అందించి డబ్ల్యుహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు కల్గిన మందులు కూడా వారి చేతిలో పెడుతున్నామన్నారు. ఇంటికి వెళ్లేటప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి, వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీజేరియన్ అయితే రూ.3 వేలు, సహజ ప్రసవం అయితే రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద విశ్రాంతి సమయంలో కూడా తోడుగా ఉండేందుకు ఈ మొత్తాన్ని చెల్లెమ్మ చేతిలో పెట్టి ఆమెను ఈ తల్లీ బిడ్డ ఎయిర్ కండీషన్ల వాహనంలోనే ఇంటి వరకు పంపించడం జరుగుతోందని చెప్పారు.
గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో అందరికీ తెలుసునన్నారు. అరకొరగా ఉండే వాహనాలు, అదీ ఒక్కొక్కసారి అందుబాటులో లేని పరిస్థితి ఉండేదన్నారు. నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రి రూపు రేఖలు మారుతున్నాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.