CM YS Jagan: ఏపి మంత్రివర్గ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సామాజిక విప్లవానికి మరో సారి నాంది పలికారు. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడిన ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తన దైన మార్కు చూపించుకున్నారు. రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) చెప్పిన సూచనో లేక సలహాదారులు ఇచ్చిన సూచనో లేక జగనే స్వయంగా తన ఆలోచనతో తీసుకున్న నిర్ణయమో కానీ ఓ స్ట్రాటజీతో మంత్రివర్గ కూర్పు చేశారని పరిశీలకులు అంటున్నారు. దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 70 శాతం మంత్రిపదవులు కట్టబెట్టారు. మొత్తం 25 మంది మంత్రివర్గంలో అత్యధికంగా బీసీ సామాజిక వర్గానికి పది, ఎస్టీ 1, మైనార్టీ 1, ఎస్సీలకు 5 స్థానాలు కేటాయించారు. టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీ వర్గాలు గత ఎన్నికలకు ముందు నుండి వైసీపీకి అండగా నిలవడంతో వారికి సముచిత న్యాయం చేశారు సీఎం జగన్. జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు చట్టసభల్లోనూ 50 శాతం రిజర్వేషన్లకు డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. కానీ మంత్రి పదవులకు ఎంపికకు రిజర్వేషన్ సిస్టమ్ లేకపోయినప్పటికీ సీఎం జగన్ పార్టీకి అండగా నిలుస్తున్న ఈ వర్గాలకు సముచిత గౌరవం కల్పించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో 56 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించిన వైఎస్ జగన్ ఈ సారి 70 శాతంకు పెంపు చేశారు. ఇంతకు ముందు మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించగా ఈ సారి నలుగురు మహిళలను తీసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా సీఎం జగన్ బీసీలకు పెద్ద పీట వేస్తూనే ఉన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇస్తూ ఏకంగా చట్టమే చేశారు వైఎస్ జగన్.
CM YS Jagan: చంద్రబాబు హయాంలో ఏమి జరిగింది అంటే…
నందమూరి తారక రామారావు నేతృత్వంలో టీడీపీ ఆవిర్భావం నుండి బీసీలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత బీసీలకు సముచిత స్థానాలు కేటాయించలేదన్న విమర్శ ఉంది. గత చంద్రబాబు కేబినెట్ లో బీసీ సామాజికవర్గం నుండి ఎడుగురికి, ఎస్సీల నుండి ముగ్గురికి మాత్రమే పదవులు ఇచ్చారు. మధ్యలో రావెల కిషోర్ బాబు, పీతల సుజాతలను తొలగించి వారి స్థానంలో జవహర్, వేరే వాళ్లను అవకాశం కల్పించారు. కమ్మ సామాజికవర్గం నుండి నలుగురికి, రెడ్డి సామాజికవర్గం నుండి నలుగురిని చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే చంద్రబాబు ఆలోచనలకు భిన్నంగా వైఎస్ జగన్ సామాజిక విప్లవానికి నాందిపలికేలా మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించి తన దైన మార్కు చాటుకున్నారు. అయితే క్షత్రియ, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సామాజికవర్గాలకు అవకాశం కల్పించలేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ వర్గాలకు కేబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ పదవులు ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గంలో మెజార్టీ ఓటర్లు వైసీపీకి వ్యతిరేకం అనేది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ పార్టీకి కంకణ బద్దుడుగా ఉన్న కొడాలి నానికి ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర డవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలన్న యోచన చేస్తున్నారు. ఇదే క్రమంలో బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోనా రఘుపతిని డిప్యూటి స్పీకర్ గా కొనసాగిస్తూ, అదే సామాజికవర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా నియమించనున్నారు. జగన్మోహనరెడ్డి స్ట్రాటజీని ఎవరూ తప్పుబట్టలేని విధంగా ఉంది. దీనితో పాటు ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.