CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజునే అవినీతి రహిత పాలన అందిస్తానని ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావు లేకుండా ప్రజలకు పనులు జరగాలని తెలిపారు. అయినప్పటికీ పలు శాఖల్లో అవినీతి కొనసాగుతూనే ఉంది. ఏసీబీ అధికారుల దాడుల్లో కొందరు అధికారులు, సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన ప్రసాదరావు సైతం ఆ శాఖలో నెలకొన్న అవినీతిపై మాట్లాడారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ శాఖల్లో అవినీతి ప్రక్షాళనకు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
CM YS Jagan: ఏసీబీ ప్రత్యేక యాప్
హోంశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించిన సీఎం జగన్..అవినీతి జరుగుతున్న విభాగాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దిశ తరహాలోనే అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ ప్రత్యేక యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో యాప్ రూపకల్పన చేయాలని చెప్పారు. అదే విధంగా మండల స్థాయి వరకూ ఏసీబీ పర్యవేక్షణ ఉండాలన్నారు సీఎం జగన్. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపై కూడా ఏసీబీ పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఏసీబీ, దిశ, ఎస్ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
డ్రగ్స్ వ్యవహారాలకు చోటు ఉండకూడదు
నేర నిర్ధారణకు ఫారెన్సిక్ విభాగం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్, రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాలకు చోటు ఉండకూడదని తెలిపారు. మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్లతో పెకిలించేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.