CM YS Jagan: దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సమస్య ఎక్కువవుతోంది. ఏపితో సహా చాలా రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. రెండు మూడు నెలల్లో తీవ్రమైన కరెంటు కోతలు ఉండనున్నాయని వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కరెంటు కోతలు మొదలవ్వగా ఏపీలోనూ త్వరలో కరెంటు కోతలు ప్రారంభం అవ్వనున్నాయని ప్రచారం జరుగుతోంది. విద్యుత్ వాడకంపై ఇటీవలే ఏపి ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి పది గంటల వరకూ ఏసీలు వాడొద్దని సూచించారు. పీక్ లోడింగ్ సమయంలో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందనీ, కాబట్టి కరెంటును జాగ్రత్తగా వాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. విద్యుత్ కొరత ఏర్పడటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని వారు పేర్కొంటున్నారు. మరో పక్క సోషల్ మీడియాలో “జగనన్న కొవ్వొత్తి – అగ్గిపెట్టె పథకం పెట్టేటట్టు” ఉన్నారంటూ ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు సెటైర్ లు వేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన ఛేశారు.
Read More: MAA: మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ కీలక లేఖ..! ముదురుతున్న వివాదం..!!
CM YS Jagan: రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దు
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ పరిస్థితులపై సమీక్ష జరిపిన సీఎం జగన్.. ప్రస్తుత బొగ్గు నిల్వలు, ధర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వద్ద నిధుల కొరత లేదనీ, దేశంలో బొగ్గు ఎక్కడ లభ్యమయినా కొనుగోలు చేయాలని ఆదేశించారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ పూర్తి సామర్థ్యంతో నడిచేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలోని సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని అవసరాలకు తగ్గట్టుగా బొగ్గును తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పారు. కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్లాంట్లలోని కొత్త యూనిట్లలో ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలన్నారు.
Read More: AP Govt: సినీ రంగానికి బిగ్ రిలీఫ్ ఇచ్చిన జగన్ సర్కార్..!!
కోల్ ఇండియాకు 300 కోట్లు బాకీ
మరో పక్క కరెంటు సమస్యను పురస్కరించుకుని వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వాన్ని విమర్శించారు. విద్యుత్ సమస్య వల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే పరిస్థితులు తలెత్తాయన్నారు. విద్యుత్ సమస్యపై తాను కోల్ ఇండియా చైర్మన్ తో చర్చించానని పేర్కొన్నారు. కోల్ ఇండియాకు ఏపి రూ.300 కోట్లు బాకీ ఉందని ఆయన తనతో చెప్పారన్నారు. కాగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.