రాష్ట్రంలో వైసీపీ ఆధికారంలోకి రావడానికి ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలనే దానిపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ క్లారిటీతో ఉన్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్ చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గడపగడపకు మన ప్రభుత్వం పై రివ్యూ నిర్వహిస్తూ ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో అబివృద్ధి పనులకు రూ.20లక్షలు, నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.2కోట్లు ఇస్తామని చెపుతూ పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేశారు. ఆ తరువాత జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పలువురు సీనియర్ మంత్రులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంలో జిల్లా అధ్యక్షులకు చిన్న పాటి క్లాస్ తీసుకున్నారుట. “జిల్లా అధ్యక్షులుగా ఉంటూ ఏమి చేస్తున్నారు.?. కొందరు ఎమ్మెల్యేలు గడప గడపకు సరిగ్గా నిర్వర్తించడం లేదు. పర్యవేక్షించి దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులుగా మీకు ఉంది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ స్థానంలో వేరే వారికి బాధ్యతలు ఇస్తా, అంతే తప్ప మీరు ఉదాశీనంగా వ్యవహరించవద్దు, మళ్లీ ప్రభుత్వం రావాలంటే ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేయాలి. ఎమ్మెల్యేలను పర్యవేక్షిస్తూ మీరు సరిగ్గా పని చేయాలి. నా పని నేను చేస్తా” అంటూ జగన్ సున్నితంగా క్లాస్ పీకినట్లు సమాచారం.
అలాగే జగన్మోహనరెడ్డి మరో కొత్త విషయాన్ని చెప్పారు. ఆగస్టు రెండో వారం నుండి ప్రతి నియోజకవర్గంలో 50 మంది సిన్సియర్ కార్యకర్తలను ఎంపిక చేసి ఆ కార్యకర్తలతో భేటీ అవుతాను చెప్పారు. ఇది కొత్త విషయం. ఎందుకంటే .. ఈ మూడు సంవత్సరాల్లో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అపాయింట్మెంట్ లు ఇవ్వలేదన్న అపవాదు ఉంది. దాదాపు 150 మంది ఎమ్మెల్యేల్లో నేరుగా ముఖాముఖి 60 – 70 మంది ఎమ్మెల్యేలకే అవకాశం లభించింది. చాలా మంది ప్రజా ప్రతినిధులు అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్న వారు ఉన్నారుట. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో సిన్సియర్ గా పని చేసే 50 మంది కార్యకర్తలను పిలిపించుకుని మాట్లాడతారుట.
అయితే ఇక్కడ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటారా ..? లేక తాను చెప్పాల్సింది చెబుతారా..? అనే డౌట్ అనే చాలా మందిలో ఉంది. కార్యకర్తల కష్టాలు, ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు వారు ఇంట్రెస్ట్ చూపుతారు. పబ్లిక్ మీడింగ్ లలో, నాయకుల సమావేశాల్లో మాట్లాడే మాటలనే జగన్ వల్లె వేస్తే కార్యకర్తలు అంత ఇంట్రెస్ట్ చూపించరు. సిన్సియర్ కార్యకర్తలతో జగన్ మాట్లాడతారు అంటే కొత్త ఉత్సాహం వారిలో ఉంటుంది. చూడాలి ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో..!