YS Jagan: దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న సమయంలో ఏపీలో సైతం అదే రీతిలో పరిస్థితులు కొనసాగుతున్నాయి. రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. రోజువారి పాజిటివ్ కేసులు పది వేలలు దాటుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో RTPCR పరీక్షలు మరింత పెంచడానికి 113టెక్నికల్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆమోదం తెలిపారు.
ఏపీ సర్కారు కీలక నిర్ణయం..
కరోనా కట్టడికి తీసుకోవలచిన చర్యలపై ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ జీఓఎం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు మరో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న VRDL కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహణకు సిబ్బంది నియామకానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న VRDL కేంద్రాల్లో RTPCR పరీక్షలు రిపోర్ట్ అతి తక్కువ సమయంలో రావడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇప్పుడేం జరుగుతుందంటే…
ఏపీలో ప్రస్తుతం RTPCR పరీక్షలు ప్రతి రోజు 40వేలకు పైబడి చేస్తున్నారు. కొత్తగా సిబ్బంది నియామకం వల్ల RTPCR పరీక్షలు రోజుకి 60వేలకు పైబడి చేయడానికి చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. ట్రూనాట్ పరీక్షలు గతంలో రోజుకి 10వేలు పరీక్షలు చేసేవాళ్లమని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని ట్రూనాట్ పరీక్షలు కూడ మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. మరో మూడు రోజుల్లో ట్రూనాట్ పరీక్షలు కూడ నిర్వహించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రములో ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీ, విజయనగరం మహారాజ మెడికల్ కాలేజీల్లో కూడ RTPCR పరీక్షలు నిర్వహిస్తాం అని అన్నారు.
కేసుల కలకలం…
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 45,581 శాంపిల్స్ పరీక్షించగా 11,766 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 24 గంటల్లోనే కోవిడ్తో 36 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.. కోవిడ్ బారిన పడి కోవిడ్ వల్ల నెల్లూరు లో ఆరుగురు, చిత్తూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, కృష్ణ లో నలుగురు, కర్నూల్ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నం లో ముగ్గురు, గుంటూరు మరియు విజయనగరం లలో ఇద్దరు చొప్పున మరణించారు.. ఇదే సమయంలో 4,441 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1009228కు చేరగా.. యాక్టివ్ కేసులు 74231 గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 927418 కరోనా నుంచి కోలుకోగా 7579 మంది ప్రాణాలు కోల్పోయారు.