CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై నుండి కంప్యూటర్ లో బటన్ నొక్కి రైతుల ఖాతాలో డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రైతాంగానికి గత చంద్రబాబు హయాంలో ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో అందుతున్న సహాయాన్ని లెక్కలతో సహా వివరించిన సీఎం జగన్.. ప్రతిపక్షాల తీరును తూర్పారబట్టారు. ప్రశ్నించాల్సిన సమయంలో చంద్రబాబును దత్తపుత్రుడు, ఈనాడు, ఏబిఎన్, టీవీ 5 ఎందుకు ప్రశ్నించలేదన్నారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలన్నారు. రైతు భరోసా పథకం గతంలో ఉండేదా అని ప్రశ్నించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
CM YS Jagan: అరకోటి మందికి పైగా రైతులకు లబ్ది
మూడేళ్లలో అరకోటి మందికిపైగా రైతులకు రైతు భరోసా కింద రూ,23,875 కోట్లు నేరుగా అందించామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇంత సహాయపడిన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా అని ప్రశ్నించారు సీఎం జగన్. ఉచిత పంటల భీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరిందని తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్టచతుష్టయం ప్రశ్నించలేదన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. లంచాలకు, వివక్షతకు రైతు భరోసా, సున్నా వడ్డీ నగదు పంపిణీ చేస్తున్నామనీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించని పంటలకు కూడా మద్దతు ధఱ కల్పించి కొనుగోలు చేస్తున్నామని వివరించారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో కరువు లేదనీ, ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులకు పెరిగిందని అన్నారు. గత ప్రభుత్వం లో వడ్డీ లేని రుణాలకు అయిదేళ్లలో చెల్లించింది రూ.782 కోట్లు మాతమేననీ, ఈ ప్రభుత్వం మూడేళ్లలో వడ్డీ లేని రుణాలకు ఇచ్చింది రూ.1282 కోట్లు అని వివరించారు.
పరిహారం అందని ఒక్క రైతును చూపలేకపోయారు
ఏ పంట సీజన్ లో జరిగిన నష్టానికి అదే సీజన్ లో పరిహారం ఇస్తున్నామని తెలిపారు. చంద్రబాబు దత్తపుత్రుడు పరామర్శకు బయలుదేరాడనీ, పరిహారం అందని ఒక్క రైతును కూడా చూపించలేకపోయారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శించారు. ఖరీఫ్ పనులు మొదలు కాకముందే వైఎస్ఆర్ రైతు భరోసా అందిస్తున్నామని, కేలండర్ ఇచ్చి క్రమం తప్పకుండా వైఎస్ఆర్ రైతు భరోసా అందిస్తున్నామన్నారు. రైతాంగానికి ఇంత మేలు చేస్తుంటే ప్రభుత్వంపై ఈర్షతో దుష్టచతుష్టయం అసత్య ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు కాకాణి గోవర్థన్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.