AP Three Capitals: రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ఏపి అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై జరిగిన చర్చ సందర్బంగా సీఎం జగన్..రాజధాని వికేంద్రీకరణ విషయంపై హైకోర్టు తీర్పును ఆక్షేపించారు. రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూ కేంద్రం హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇంత స్పష్టంగా కేంద్రం అఫిడవిట్ ఇచ్చిన తరువాత కూడా పరిపాలనా వికేంద్రీకరణ పై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదనీ, రాజధాని పై కేంద్రం నుండి అనమతులు తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏమి లేదని చెప్పిందన్నారు.
లక్ష కోట్లతో నెల రోజుల్లో రాజధాని కట్టేయాలని కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలి లేకుంటే సిస్టమ్ మొత్తం కుప్పకూలిపోతుందన్నారు. రాజధానిపై వాళ్లంతకు వాళ్ల ఊహించుకుని అటు గుంటూరు, ఇటు విజయవాడ కాకుండా తమకు బినామీలకు భూములున్న చోట రాజధాని పెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే వైసీపీకి ప్రజలు ఘన విజయం కట్టబెట్టారని అన్నారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణ కమిటీ కూడా స్పష్టం చేసిందన్నారు జగన్. శాసన వ్యవస్థలు ఓ చట్టాన్ని చేయాలా వద్దా అని కోర్టులు నిర్ణయించలేవన్నారు.
రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం ఒక్క శాసన వ్యవస్థకే ఉందని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా ఆచరణ సాధ్యం కాని తీర్పు హైకోర్టు ఇచ్చిందన్నారు. వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో మాటలన్నింటికీ కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ మరో మారు స్పష్టం చేశారు. తమకు హైకోర్టు పై గౌరవం ఉందని అలానే రాష్ట్ర అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ రోజు చర్చ జరగకపోతే చట్టాలు చేయాల్సింది శాసనసభా లేదా కోర్టులా అనేది క్వశ్చన్ మార్క్ అవుతుందన్నారు. న్యాయసలహాలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరుపుతున్నామన్నారు సీఎం జగన్. అందరికీ మంచి చేయడానికే తమ ప్రభుత్వం ఉందన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తామనీ, వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేసేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.