Puthalapattu MLA: సీఎంగా వైఎస్ జగన్మోహనరెడ్డి బాధ్యతలు చేపట్టి రెండన్నరేళ్లు గడిచింది. రానున్న రెండున్నర సంవత్సరాల్లో ప్రజలకు దగ్గరగా వెళ్లి పరిపాలనను పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లి గడచిన రెండున్నరేళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను, జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలోనూ, పరిపాలనలోనూ అంతర్గతంగా నెలకొన్న అవినీతిని కూడా నియంత్రించాలని, పూర్తి స్థాయిలో అదుపు చేయాలనేది సీఎం జగన్ ప్రణాలికగా ఉంది. సాధారణంగా పరిపాలనా పరంగా జరిగే అధికారిక అవినీతిని అదుపు చేయడం సులువు అయినప్పటికీ రాజకీయంగా జరిగే అవినీతిని అదుపు చేయడం కష్టం. వైసీపీలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తుండగా, అవి సీఎం వరకూ చేరి చికాకు పెట్టిస్తున్నాయి. అనేక సర్వేలు, అధ్యయన నివేదికలు కూడా ఎమ్మెల్యేల పని తీరు సంతృప్తికరంగా లేదని ఇచ్చాయి. అయితే వీటన్నింటినీ మించి తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఒకాయన తన సొంత పార్టీ నాయకుల వద్ద పదవి ఇప్పిస్తానని రూ. అయిన్నర కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారనే ఆరోపణలు రావడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ లేఖ తాను రాయలేదని సుచిత్ర పేర్కొంటున్నప్పటికీ.. మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే బాబు కూడా లేఖ విషయంపై స్పందించారు. రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Puthalapattu MLA: జడ్పీ ఉపాధ్యక్ష పదవికి అయిన్నర కోట్లకు బేరం
చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. దీనికి ఎమ్మెల్యేగా ఎంఎస్ బాబు ఉన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి కూడా ఆపసోపాలు పడిన ఎమ్మెల్యేగా అప్పట్లోనే ఈయన సోషల్ మీడియాలో ఖ్యాతిగాంచారు. 2019 ఎన్నికల్లో పార్టీ గాలి, సీఎం జగన్మోహనరెడ్డి గాలి, ఆ నియోజకవర్గంలో కొందరు నాయకులు తెరవెనుక పట్టుదల, కృషితో బాబు 35వేల మెజార్టీతో గెలిచారు. అయితే చిత్తురు జిల్లా జిల్లా పరిషత్ ఉపాధ్యక్ష పదవి (వైస్ చైర్మన్) పూతలపట్టు నియోజకవర్గానికి కేటాయించారు. నిజానికి ఆ జిల్లాలో పెత్తనం మొత్తం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. ఆయన ఎవరికి చెబితే ఆయనకే పదవి దక్కుతుంది. కానీ ఎమ్మెల్యే మాత్రం తను చక్రం తిప్పారు. తన నియోజకవర్గ పరిధిలోని ఐరాల మండలానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్పీటీసీ వి.సుచిత్ర దగ్గర రూ.5.50 కోట్లు తీసుకుని జడ్ పీ ఉపాధ్యక్ష పదవి ఇప్పిస్తానని అన్నారట. ఈ మేరకు ఆమె సీఎం జగన్ కు ఫిర్యాదు చేసినట్టు ఒక లేఖ బయటకు వచ్చింది. ఇది చిత్తూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఆ లేఖలో ఏమున్నదంటే..
“గత 9 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పని చేస్తున్నానని పేర్కొన్న ఏ సుచిత్ర.. ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో తమరి (జగన్) అదరాభిమానాలు, వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులు, అభిపృద్ధి కార్యక్రమాలతో జడ్పీటీసీగా గెలిచానని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా ఐరాల మండలం టీడీపీ కంచుకోటగా ఉందనీ అలాంటి మండలంలో మొదటి సారిగా 13వేల మెజార్టీతో జడ్పీటీసీగా విజయం సాధించినట్లు జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మమ్మల్ని పిలిచి వైస్ ప్రెసిడెంట్ పదవి ఇప్పిస్తాననీ రూ.5.50 కోట్లు అడగ్గా ఇవ్వడం జరిగిందన్నారు. ఒక వేళ వైస్ చైర్మన్ పదవి ఇవ్వలేకపోతే ఆర్ టీ సీ బోర్డు చైర్మన్ లేదా కుప్పం ఇన్ చార్జి గా తప్పకుండా ఇప్పిస్తామని ఎమ్మెల్యే ప్రమాణం చేశారన్నారు. అయితే ఎమ్మెల్యే చెప్పినట్లుగా తనకు ఏ పదవీ ఇవ్వలేదనీ, తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అనేక పర్యాయాలు అడిగినా ఇస్తాను ఇస్తాను అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. బెంగళూరుకు రండి మీ డబ్బులు ఇస్తాను అని మమ్మల్ని చెబితే వెళ్లామనీ, అక్కడ ఎమ్మెల్యే తన అనుచరులతో బెదిరించారని సుచిత్ర లేఖలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని, డబ్బులు ఇచ్చేది లేదు, మీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోండి, మిమ్మల్ని ఎవరు కాపాడతారో నేను చూస్తానంటూ బెదిరించారని, ఎమ్మెల్యే నుండి ప్రాణ హాని ఉందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాబు నుండి రక్షణ కల్పించి, తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని సీఎం జగన్ ను లేఖలో విజ్ఞప్తి చేశారు”..! ఈ మొత్తం వ్యవహారం బయటకు రావడం.., లేఖ కూడా లీకవడంతో సుచిత్ర స్పందించారు. ఆ లేఖ తాను రాయలేదని పేర్కొన్నారు. ఎవరో కుట్రలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు ఎమ్మెల్యే బాబు కూడా తనను కలిసిన మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని.., ప్రత్యర్ధులు ఎవరో ఇలా సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ లేఖలో అంశాలు వాస్తవమో కాదో.. తేల్చే ముందు అసలు ఈ లేఖ వాస్తవమో కాదో తేల్చాల్సి ఉంది.