వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబు కు రాజమండ్రి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఆనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంతకు ముందు పలు పర్యాయాలు ఆనంత బాబు బెయిల్ కోసం జిల్లా కోర్టు, హైకోర్టులను ఆశ్రయించగా మంజూరు కాలేదు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనంతబాబు తల్లి మంగారత్నం నిన్న రాత్రి కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో తల్లి అంత్యక్రియలకు హజరయ్యేందుకు గానూ అత్యవసర బెయిల్ మంజూరునకు సోమవారం రాజమండ్రి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రూ.25 వేల పూచికత్తు, ఇద్దరి జామీనుతో ఎమ్మెల్సీ ఆనంతబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఈ నెల 25వ తేదీన తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాలని బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడు రోజులు ఆయన ఎల్లవరం గ్రామంలోనే ఉండాలనీ, అంత్యక్రియల సమయంలో ఆయన పక్కన పోలీసులు కూడా ఉంటారని తెలిపింది. కేసు గురించి ఎవరి వద్ద ప్రస్తావించకుండా ఉండాలన్న షరతు కూడా విధించింది.
మరో పక్క అనంతబాబు పై పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటు సక్రమంగా లేదంటూ ఇటీవల రాజమండ్రి లోని ఎస్సీ, ఎస్టీ కోర్టు తిరస్కరించింది. సంపూర్ణంగా చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్సీని కాపాడేందుకు పోలీసులు కావాలనే చార్జిషీటు దాఖలు చేయడంలో తాత్సారం చేశారనీ, ఉద్దేశపూర్వకంగా అసంపూర్తిగా దాఖలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. బాధితుడి కుటుంబ సభ్యులు ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దంటూ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. మరో పక్క అనంత బాబును అరెస్టు చేసి 90 రోజులు దాటినందుకు ఆనంతబాబు న్యాయవాదులు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. 90 రోజుల్లో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయకపోతే కోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉంటాయి.