Harsha Kumar: ప్రస్తుతం ఏపి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నా గత కొన్ని నెలలుగా క్రియాశీలకంగా పని చేస్తున్న మాజీ ఎంపి హర్షకుమార్ ఆ పార్టీపై అలగారు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడుగా గెలిచిన హర్షకుమార్ దళిత సామాజిక వర్గ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ప్రాతినిధ్యం వహించిన అమలాపురం నియోజకవర్గం నుండి హర్షకుమర్ రెండు పర్యాయాలు ఎంపిగా గెలిచారు. అధికార వైసీపీపై తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు చేస్తూ వస్తున్న హర్షకుమార్ ఏపి పీసీసీ రేసులోనూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాలకు స్వస్తి చెబుతూ తీసుకున్న నిర్ణయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
Harsha Kumar: హర్షకుమార్ హర్ట్ ఎందుకు అయ్యారంటే..
హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో చాలా యాక్టివ్ గా ఉండే శ్రీరాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ తరుణంలో శ్రీరాజ్ ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు ఉత్తర్వులు వెలువడించారు. శ్రీరాజ్ చేసిన తప్పు ఏమిటంటే..ఇటీవల ట్విట్టర్ ఇండియా రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ ను తాత్కాలికంగా నిలిపివేసిన సమయంలో ఓ వీడియోను పోస్టు చేయడం వివాదాస్పదమైంది. ఆ పోస్టును పరిశీలించిన క్రమశిక్షణా సంఘం పార్టీ నియమావళిని ఉల్లంఘించేదిగా ఉందని నిర్ధారణకు వచ్చి శ్రీరాజ్ పై వేటు వేసింది. దీనిపై హర్షకుమార్ తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. చేయని తప్పుకు తన కుమారుడికి శిక్ష వేస్తారా అంటూ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజకీయల్లో నుండే తప్పుకోబుతున్నట్లుగా హర్షకుమార్ ప్రకటించడం ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.