ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడులు విషయంలో కుట్ర కోణం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారుల సమావేశం సాక్షిగా చెప్పడం ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది. హిందూ దేవాలయాల మీద కుట్ర కోణం ఉందని అందరికీ తెలిసిన విషయమే.. ఆ కుట్రకు బాధ్యులెవరు…? దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? పెద్దల పాత్ర ఉందా? అనే విషయాలను బయటపెట్టాల్సిన ప్రభుత్వం దీనిపై కుట్ర కోణం ఉందని దీనిని కొందరు కుట్ర చేశారని చెప్పడం… ప్రభుత్వ అసమర్థతను మరోసారి బయట పెట్టుకోవడం తప్ప మరేమీ ఉండదు.
ఎందుకు ఈ స్టేట్మెంట్!!
**ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆదిత్యనాథ్ దాస్ ఈ విషయాన్ని చెప్పడం స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం ప్రభుత్వం హిందూ ఆలయాలు మీద ఆత్మరక్షణలో పడింది అనే కోణాన్ని చూపిస్తోంది. వ్యవస్థలన్నీ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు కుట్ర కోణాలు చేదించడం లో ముందుకు వెళ్లలేక పోతున్న ప్రభుత్వం దీనిపై కుట్ర ఉందని… ప్రతిపక్షాలే దీనిని చేశాయి అంటూ అర్థం లేని, ఆధారాలు లేని ప్రకటనలు చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప… మరేమీ ఉండదు. ఒకవేళ ప్రతిపక్ష నాయకుల పాత్ర ఈ కుట్ర కోణాలు వెనక ఉంటే వెంటనే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది మరో ప్రశ్న.
ప్రత్యేకమైన టీమ్ చేస్తుందా??
**ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన కామెంట్ లో ఓ కీలక విషయం బయటకు వచ్చింది. హిందూ దేవాలయాల నెత్తి మీద ఒక ప్రత్యేకమైన బృందంతో దాడులు చేయిస్తున్నారు అనే అనుమానం బయటకు వచ్చింది. ప్రకాశం జిల్లాలో జరిగిన దానికి రాజమండ్రిలో జరిగిన దానికి మధ్య ఒకే రకమైన రంపం వాడారని ఆయన చెప్పడం… కొన్ని కేసుల్లో ఒకే రకమైన సారూప్యతను పోలీసులు గుర్తించడం లాంటివి చూస్తుంటే ఒక ప్రత్యేకమైన టీం హిందూ ఆలయాల మీద దాడులకు ఏమైనా ప్రత్యేకంగా తయారయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అన్ని కేసులలో ఎలాంటి సారూప్యతలు ఉన్నాయి… ఎక్కడ దగ్గర సంబంధాలు ఉన్నాయి అనే దానిని తేలిస్తే దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది తెలుస్తుంది. ఆదిత్యానాథ్ చెప్పిన దాని ప్రకారం ఇది ఒక బృందం కనుక రాష్ట్రవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడానికి ఎవరైనా ప్రత్యేకంగా తయారు చేసి ఉంటే బృందంలోని ఒక సభ్యుడు దొరికిన మొత్తం వ్యవహారం బట్టబయలు అవుతుంది. దీని మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ కేసులోని మూలాలను బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంతేగాని దీని వెనుక కుట్ర కోణాలు ఉన్నాయి అని ప్రతిపక్షాలు ఉన్నాయని అర్ధరహితమైన ఆధారాలు లేని ప్రకటనలు చేస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు.