YSRCP : నెల్లూరు జిల్లా కీలక నియోజకవర్గం గూడూరు తలనొప్పులు అధికారపార్టీకి తప్పడం లేదు. ఇక్కడ తరచూ ఎమ్మెల్యే వరప్రసాద్ తీరు పట్ల స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగుర వేస్తున్నారు. పార్టీ పరువు తీసేలా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారంటూ బహిరంగంగా ఆరోపణలు వ్యాఖ్యానాలు చేయడం ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారింది. గెలిచిన దగ్గర నుంచి గూడూరు జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిసారి మీడియాలోకి ఎక్కడం పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి అనేలా నేతలు ప్రవర్తించడం పట్ల జగన్ కూడా ఏమీ అనలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు.
** గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గతంలో తిరుపతి ఎంపీగా పని చేశారు. ప్రజారాజ్యం పార్టీ లో మొదట తన రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత వైఎస్సార్ సిపి లోకి వచ్చిన ఆయనకు జగన్ సముచిత స్థానం ఈజీ తిరుపతి లోక్సభ స్థానం నుంచి 2014లో పోటీ చేయించారు. మంచి మెజారిటీతో గెలిచిన వరప్రసాద్ తర్వాత పార్టీ విషయాల్లో మాత్రం అంతంత మాత్రంగానే వ్యవహారించారు.
** 2019లో వరప్రసాద్కు తిరుపతి ఎంపీగా మరోసారి అవకాశం ఇస్తారని అంతా భావించారు. తిరుపతి ఎంపీ సీటు కోసం ఎవరూ పోటీకి సైతం లేకపోవడంతో, ఎస్సీ నియోజకవర్గంగా రిజర్వు కావడంతో ఖచ్చితంగా వరప్రసాద్ మరోసారి ఎంపీగా తిరుపతి లోక్సభ స్థానం నుంచి బరిలో ఉంటారని భావించారు. అయితే చివరి నిమిషంలో జగన్ వరప్రసాద్ కు హ్యాండ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నెల్లూరుకు చెందిన బల్లి దుర్గాప్రసాద్ పార్టీలోకి తీసుకొచ్చి అప్పటికప్పుడు తిరుపతి ఎంపీ గా ఆయన పేరును జగన్ ప్రకటించారు. దీంతో తిరుపతి లోక్సభ సీటు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వరప్రసాద్ ఎం చేయాలో పాలు పోలేదు.
** 2014లో గూడూరు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టిడిపి లోకి వెళ్లి పోయిన పాశం సునీల్కుమార్ స్థానంలో గూడూరు నియోజకవర్గం నుంచి వరప్రసాద్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎంపీ గా పనిచేసిన తాను మరోసారి ఎమ్మెల్యేగా వెళ్లడం, అందులోనూ కీలకమైన లోక్సభ నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళడం మొదటినుంచి వరప్రసాద్ కి ఇష్టం లేదు. ఈ విషయాన్ని పలుమార్లు జగన్కు చెప్పిన ఆయన కచ్చితంగా గూడూరు నుంచి పోటీలో ఉండాలని స్పష్టం చేయడంతో విధిలేని పరిస్థితిలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు.
** సీనియర్ ఐఏఎస్ అధికారి గా తమిళనాడు రాష్ట్రంలో పలు కీలకమైన శాఖ బాధ్యతలు నిర్వర్తించిన వరప్రసాద్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. మంచి పాలకుడిగా ఐడియాలజీ ఉన్న వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన తీరు ఒక్కసారిగా మారిపోయింది. పరిపాలనా వ్యవహారాలు పక్కన పెడితే కనీసం రాజకీయ వ్యవహారాలను ఆయన తేడాగా నిర్వర్తించడం, సొంత పార్టీ కార్యకర్తలను దగ్గరకు రానీయకుండా అడ్డుకోవడం అలాంటి పనులతో మొదటి నుంచి ఆయన తీరు వివాదాస్పదం అయ్యింది. ముఖ్యంగా ఎన్నికల వేళ ఆయన గూడూరు వీధుల్లో మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రవర్తించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. గూడూరు నియోజకవర్గం నుంచి గెలిచిన వరప్రసాద్ సొంత పార్టీ కార్యకర్తల మన్ననలు అందుకోలేక పోయారు.
** ఏ విషయంలోనూ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకు వెళ్లారని, ఆయన వన్ మ్యాన్ షో గా మొత్తం కార్యకలాపాలు నిర్వహిస్తారని పేరు తెచ్చుకున్నారు. సమస్యలను చెబితే కార్యకర్తలను కోపగించుకుంటారు అనే పేరు ఉంది. ఇక ఎన్నికల్లో సాయం చేసిన పార్టీ నాయకులను ఆయన అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న పేరు ఉండటంతో ప్రతిసారి గూడూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రచ్చకు ఎక్కుతున్నారు. ఎమ్మెల్యే తీరు మీద బహిరంగంగా తిరుగుబాటు ఎగురవేస్తున్నారు.
తాజాగా మరో ఆరోపణ!
ప్రస్తుతం గూడూరు నియోజకవర్గంలో కొత్త వివాదం బయటకు వస్తోంది. ఇక్కడ వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి గా నియోజకవర్గం నాయకుడిగా ఉన్న హరిచంద్ర రెడ్డి కి ఎమ్మెల్యే వరప్రసాద్ కు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బస్టాండ్ కట్టిస్తాం అంటూ ఎమ్మెల్యే 10 లక్షల మేర తన వద్ద విరాళం తీసుకున్నారని, దాన్ని లెక్కలు చెప్పలేదని, తనతో పాటు చాలామంది దగ్గర ఎమ్మెల్యే ఇదే పేరుమీద డబ్బులు దండుకుంటున్నారు అన్నది హరిచంద్ర రెడ్డి బహిరంగంగా ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో వ్యాపారులు బడా కాంట్రాక్టర్లకు వివిధ పన్నుల పేరుతో డబ్బులు ఎమ్మెల్యే వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఏవైనా అభివృద్ధి పనులు గురించి చెబితే అసలు దాని గురించి పట్టించుకోవడం లేదని, తర్వాత చూద్దాం చేద్దాం అంటూ కార్యకర్తలను కసురు కుంటున్నారని ఆరోపించడంతో గూడూరు నియోజకవర్గం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ కుమ్ములాటలతో రచ్చకేక్కినట్లు అయింది. దీనిపై అధినేత జగన్ నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులను వెంటనే అల్లరి చేయకపోతే మరి కొన్ని ఆరోపణలు వచ్చి పార్టీ పరువు పూర్తిగా గంగలో కలిసే అవకాశం లేకపోలేదు.