Corona effect : దేశంలో, రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. దేశంలో రోజుకు లక్షా 15వేలకు పైగా కేసులు నమోదు అవుతుండగా రాష్ట్రంలో రెండు వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 2300లకుపైగా పొజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వదర్శనం టోకెన్ జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది.
శ్రీవారి సర్వదర్శనం టొకెన్ల జారీని ఆదివారం సాయంత్రం నుండి నిలిపివేయాలని టీడీడీ నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్ మరో సారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని 11వ తేదీ సాయంత్రం తరువాత నిలిపివేయాలని నిర్ణయించారు. తిరుపతి నగరంలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లల బారులు తీరి వేచి ఉండటం వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.