Corona Effect: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలలో మాదిరిగా పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి ఇంటర్ పరీక్షలను వాయిదా వేసే ఆలోచన ఏపి ప్రభుత్వం చేస్తుందని అందరూ భావించారు. అయితే ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం విద్య, వైద్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి అందరి ఊహాలకు భిన్నంగా నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు.
రాష్ట్రంలో టెన్త్ పరీక్షలకు ఇంకా సమయం ఉండటం, ఇంటర్ పరీక్షల ప్రక్రియ ప్రారంభం అయి ఉన్నందున వాటిని యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఒకటవ తరగతి నుండి 9వ తరగతి వరకూ క్లాస్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రేపటి నుండి ఒకటవ తరగతి నుండి 9వ తరగతి వరకూ సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. సీఎం జగన్మోహనరెడ్డి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి పాఠశాలల్లో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు గానూ ఒకటవ తరగతి నుండి 9వ తరగతి వరకూ క్లాస్ లను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇక పదవ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో భౌతిక దూరం పాటిస్తూ క్లాసులు నిర్వహణ జరుగుతుందన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఇప్పటికే జరుగుతున్నాయనీ, ఇవి ఈ నెల 25వ తేదీతో ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి అవుతాయన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యుల్ లో ఎటువంటి మార్పు లేదని మంత్రి స్పష్టం చేశారు.