Corona Tragedy: ఏపిలోని విజయనగరం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది, కరోనా నేపథ్యంలో విశాఖ నుండి పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుండగా విశాఖకు పక్కనే ఉన్న విజయనగరంలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతి చెందడం తీవ్ర కలకలాన్ని రేపింది. విజయనగరంలో గల మహారాజా ప్రభుత్వఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో ఆదివారం రాత్రి ఆక్సిజన్ నిల్వలు నిండుకోవడంతో కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ఉన్న పేషంట్స్ ను వేరే ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు కోవిడ్ పేషంట్స్ కు ప్రాణవాయువు అందక మృతి చెందారు. దీంతో ఆసుపత్రి వద్ద మృతుల బంధువుల రోధనలు మిన్నంటాయి. ఆక్సిజన్ సరఫరా పునరుద్దరణ కాకపోవడంతో కొంత మంది రోగులను వేరే ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఉదయానికి అయిదుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
కరోనా పరిస్థితులు దారుణంగా మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకూ ఆక్సిజన్ అందక ఆసుపత్రుల్లో కోవిడ్ పేషంట్స్ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండగా ఆ స్థాయిలో కేసులు లేకపోయినా మొట్టమొదటి సారిగా ఏపిలో ఆక్సిజన్ అందక ఆసుపత్రిలో కోవిడ్ పేషంట్స్ మృతి చెందడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ఈ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ హరి జవహర్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా పేషంట్స్ మృతి చెందలేదన్నారు. అసుపత్రిలో చనిపోయిన ఇద్దరు రోగులు ఇతర వ్యాధులతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారన్నారు. మహారాజ ఆసుపత్రిలో మొత్తం 290 మంది కోవిడ్ రోగులు ఉండగా 25 మందికే ఆక్సిజన్ అందిస్తున్నారని ఆయన తెలిపారు.