Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సెకండ్ డోస్ సరైన సమయానికి అందుతుందా లేదా అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. దీంతో తాజాగా రాష్ట్రానికి వచ్చిన వ్యాక్సిన్ లను ముందుగా ఫస్ట్ డోస్ వేసుకున్న వారికి సెకండ్ డోస్ గా అందించి వాటిలో మిగిలినవి మొదటి డోసు వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న వారందరికీ సెకండ్ డోస్ వేస్తామనీ, ఎటువంటి భయాందోళనలకు, అపోహాలకు గురికావొద్దని ఆయన కోరారు. ఈ నెలలో కేంద్రమిచ్చే డోస్ లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసే డోస్ లను నిర్ధేశించిన సమాయానికే సెకండ్ డోస్ కు వినియోగిస్తామనీ, వారికి వేయగా మిగిలితే ఫస్ట్ డోస్ గా టీకాలు వేస్తామని అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు..
కోవాగ్జిన్ కు నాలుగు వారాలు, కొవిషీల్డ్ 6 నుంచి 8 వారాల టైమ్ లిమిట్ దాటకుండా సెకండ్ డోస్ వేస్తామని తెలిపారు. సెకండ్ డోస్ వేయగా మిగిలిన డోస్ లనే ఇతరులకు ఫస్ట్ డోస్ గా వేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బ్యాంకు, ఏపీఎస్ ఆర్టీసీ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ తమకు వ్యాక్సిన్ ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు. ఈ నెల 15 లోగా కేంద్ర ప్రభుత్వం నుంచి 9 లక్షల డోస్ లు రానుండగా 10 లక్షల డోస్ లను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేయనుందని తెలిపారు. ఈ మొత్తం 19 లక్షల డోస్ లను సెకండ్ డోస్ లుగా వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.